చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లడం ఖాయం: రవీంద్రనాథ్, గవర్నర్తో కాంగ్రెస్ నేతలు
కడప/ హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నది ఎపి రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ పిలుపు మేరకు శనివారం కడప కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
ఆ దీక్షలను కడప శాసనసభ్యుడు అంజాద్ బాషా ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన రవీంద్ర నాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో రూ.1.50 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని, ఈ వ్యవహారంలో భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ జైలుకెళ్లడం ఖాయమని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకులు శనివారం హైదరాబాదులో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారంటూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులపై పోలీసు స్టేషన్లలో చేసిన ఫిర్యాదులను కేసులుగా నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని వారు గవర్నర్ను కోరారు.
గవర్నర్తో భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఆ ముగ్గురు కూడా బేఖాతరు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వారు మోసం చేస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.