మా రాజధాని మాకివ్వాలి: గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి సిద్దం: సీమ నేతల అల్టిమేటం..!
రాజధాని మార్పు పైన సీమ నేతలు మండిపడుతున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ రాజధాని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ అభ్యర్ధనను పట్టించుకోకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి సిద్దమంటూ అల్టిమేటం జారీ చేసారు. మూడు రాజధానులు..అసెంబ్లీలో బిల్లు ఆమోదం..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపటం..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పైన సీమ నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. తాము ఇప్పటికే తమ ప్రాంత అభిప్రాయాలను ముఖ్యమంత్రి..హైపవర్ కమిటీకి లేఖల ద్వారా తెలియచేసినా..పట్టించుకోవటం లేదనే అసహనం వ్యక్తం చేసారు. దీంతో..అమరాతి నుండి రాజధాని తరలింపుకు ముందే సీమ విషయం పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తేవాలని ఆలోచన చేస్తున్నారు.
రాయలసీమ నేతల కీలక సమావేశం..
రాజధాని మార్పు కారణంగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి సిద్దంగా ఉన్నామని రాయలసీమ నేతలు ప్రకటించారు. అవసరమైతే తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పర్యటనలు చేయాలని నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు వచ్చిన సమయం నుండి సీమ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీలో బిల్లు ఆమోదానికి ముందే తమ అభ్యర్ధలను..డిమాండ్లను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా వివరించారు. అదే సమయంలో తమ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని..గతంలో శ్రీబాగ్ ఒప్పందం మేరకు అమలు కాని నిర్ణయాలను అందులో ప్రస్తావించారు. హైపవర్ కమిటీ సభ్యులకు లేఖ ద్వారా వాటిని గుర్తు చేసారు. అయితే, ప్రభుత్వం నుండి మాత్రం వారికి అధికారికంగా ఎటువంటి సమాధానం..హామీ రాలేదు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన పైన వారు స్పష్టత కోరుతున్నారు.
పూర్తి స్థాయి హైకోర్టు ఏర్పాటు చేయాలి..
మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటంచినా.. జీఎన్ రావు..బోస్టన్ కమిటీల సిఫార్సుల మేరకు విశాఖ..అమరావతిలో హైకోర్టు బెంచీల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, వీటి పైన ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. మొత్తంగా హైకోర్టును కర్నూలులోనే కొనసాగి స్తారా..లేక విశాఖ..అమరావతిల్లో బెంచ్ లను ఏర్పాటు చేస్తారా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే సమయంలో కర్నూలులోనే పూర్తి స్థాయి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీలు మైసూరా రెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయ రెడ్డి, దినేష్ రెడ్డి వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో నే మరోసారి భేటీ అయి కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications