పరిధి దాటోద్దు: సోము వీర్రాజుకు రాయపాటి చురకలు
గుంటూరు: నవ్యాంధ్ర రాజధానిపై భారతీయ జనతా పార్టీ నేత సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికావని తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. టీడీపీ మిత్రపక్షమన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన చురకంటించారు.
గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాయపాటి... వీర్రాజు వ్యాఖ్యలపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పరిధి దాటి మాట్లాడవద్దని ఎంపీ రాయపాటి సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని, కేంద్రం స్పందనను బట్టి తమ స్పందన ఉంటుందని రాయపాటి వివరించారు.

కాగా, సోము వీర్రాజు సోమవారం సోమవారం మాట్లాడుతూ.. నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాలకు సమకూరుస్తున్న నిధులను చంద్రబాబు ప్రభుత్వం అతి తెలివిగా తమ పథకాలకు మళ్లించుకుంటుందని ఆరోపించారు.
అంతేగాక, డ్వాక్రా సంఘాలను పివి నర్సింహారావు ప్రభుత్వం హయాంలో ప్రవేశపెడితే ఆ పథకం అమలు ఘనత తమదేనని అప్పట్లో చంద్రబాబు చెప్పుకున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుండి అనూహ్యంగా నిధులు సమకూరాయని తెలిపారు.
రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ రోడ్ల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కొత్తగా రాజధాని నిర్మాణం జరిగే అమరావతిలో 8ప్రధాన రహదారుల అభివృద్ధికి 500 కోట్లు మంజూరు చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. ఏపీలో విద్యుత్ కొరత లేకపోవడం, ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎన్ఆర్ఇజిఎస్ తదితర ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు సమకూర్చిందని వివరించారు.












Click it and Unblock the Notifications