రాయపాటి రాజకీయం..! చేరేనా గమ్యస్థానం...?
అమరావతి/హైదరాబాద్ : అన్నీ వున్నా అంగట్లో శని ఉందన్న చందంగా ఉంది ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి. అంతే కాదు సుధీర్ఘ అనుబవం ఉన్నా రాజకీయంగా కలసిరాని నేత ఎవరైనా ఉన్నారంటే, అది రాయపాటి సాంబశివరావు అనే చెప్పాలి. గుంటూరులో పొగాకు వ్యాపారిగా అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించారు. అదేవిధంగా కాస్త నెగటీవ్ షేడ్స్ ను కూడా ఆపాదించుకున్నారు. అప్పట్లో పొగాకుబేళ్లను రష్యా, చైనా తదితర దేశాలకు గుంటూరు నుంచే ఎగుమతి చేసేవాళ్లు. లాభాలకోసం పొగాకు బేళ్లలో రాళ్లను చేర్చి పంపారనే ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి. అదే రాయపాటి రాజకీయ జీవితం మొత్తంలో చేసిన ఏకైక తప్పుగా మిగిలిపోయింది.
రాజకీయంగా సుధీర్గ అనుభవం..! ప్రస్తుత ప్రయాణం అగమ్యగోచరం..!!
సాంబశివరావు తమ్ముడు డాక్టర్ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా పనిచేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. గుంటూరు మేయర్గా పనిచేసిన రాయపాటి వారసుడు కూడా ఆశించనంత ప్రజాధరణ సాధించలేకపోయారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కుదేలవటంతో రాయపాటి చివరి నిమిషయంలో తెదేపాలో చేరి నర్సరావుపేట ఎంపీ సీటు సంపాదించుకుని గెలిచారు. ఆ తరువాత బాబు తనను టీటీడీ ఛైర్మన్ చేస్తారని ఆశపడి భంగపడ్డారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
బాబు పక్కన పెడితే ఏంటి పరిస్థితి..! ప్రత్యామ్నాయం ఫానేనా..?
ఒకానొక దశలో పార్టీకు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ రాయపాటి ఆర్ధిక పరిస్థితుల్లో పదవి, అధికార పార్టీ అండ లేకుండా మనుగడ సాగించలేమనే ఆలోచనతో పార్టీని అంటిపెట్టుకున్నారు. నర్సరావుపేట ఎంపీగా కూడా అంతగా ప్రజల్లోకి వెళ్లలేక పోయారు సాంబశివరావు. పార్టీ కార్యకర్తలతోనూ మమేకం కాలేకపోయారు. ఇవన్నీ రాయపాటి రాజకీయాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఈ సారి ఎన్నికల్లో రాయపాటిని నిలబెట్టినా ఓటమి ఖాయమంటూ సర్వేలు రావటంతో చంద్రబాబు రాయపాటిని పక్కనబెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రాయపాటి వర్గాన్ని టీడిపి దూరం చేసుకుంటుందా..? జిల్లాలో నెలకొన్న ఉత్కంఠ..!!
అలా జరిగితే రాయపాటి వర్గం పార్టీకు దూరమవుతుందనే ఉద్దేశంతో టీడీపీ ఆచితూచి స్పందిస్తోంది. తనకు ఎమ్మెల్యేగా సత్తెనపల్లి నుంచి పోటీచేయాలని ఉందంటూ రాయపాటి తన కోరికను చంద్రబాబు ఎదుట ఉంచారు. అలా కుదరని పక్షంలో గుంటూరు పశ్చిమం సీటును తనకుమారుడు రంగారావుకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అలకబూనిన రాయపాటిని బుజ్జగించేందుకు సుజనాచౌదరి రంగంలోకి దిగినా ససేమిరా అన్నట్లు సమాచారం. మరోవైపు ఆయన శిష్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్కూ తాడికొండ సీటు కేటాయింపుపై సందిగ్థత నెలకొంది.
ఇంతకీ రాయపాటి ఏ గట్టున ఉంటారు..! అదికార పక్షమా..? ప్రతిపక్షమా..?
ఇప్పుడు ఇద్దరూ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ వున్న పరిస్థితుల్లో ఆ ఇద్దరూ వైసీపీలోకి చేరితే గుంటూరు జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుంటుంది. టీడీపీ ని ఆత్మరక్షణలో పడేసినట్టూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాయపాటి తనకోసం పార్టీ మారతారా ? వారసుడి కోసం అక్కడే కొనసాగుతారా! అనే అంశం పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.