రాజధానిపై రాయపాటి సంచలనం, జేడీ శీలం కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ వేశారు. వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఉన్న వారు కొందరు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేశారని రాయపాటి ఆరోపించారు.
కొందరి సూచన మేరకే వినుకొండను రాజధాని అన్నారని ఆరోపించారు. దొనకొండలో కమిటీ సభ్యులు భూములు కొన్నారని ఆరోపించారు. కమిటీని కొందరు నాయకులు ప్రభావితం చేశారన్నారు. రాయపాటి వ్యాఖ్యల పైన జేడీ శీలం స్పందించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరిలో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుతున్నారన్నారు. కమిటీ నివేదికతో టీడీపీ నేతలు కంగుతిన్నారన్నారు.
మరోవైపు, రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత వ్యవహారం కాదని, కేంద్రమే రాజధానిని విషయాన్ని నిర్ణయించాలని పలువురు అంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడికి కమిటీ లొంగిపోయి నివేదిక ఇచ్చిందన్నారు. వీజీటీఎం రాజధాని ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకమంటున్నారు.