ఇక్కడిలా, అక్కడ అలా: తెలంగాణకు ఇవ్వలేమని ఏపీ, ఇస్తామని బాబు ట్విస్ట్!
హైదరాబాద్: విద్యుత్ వాటాల వివాదం కొనసాగుతోంది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) నిర్వహించిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధికారులు తమతమ రాష్ట్రాల వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగిశాయి. ఈ భేటీలో వాటాలు తేలలేదు. కృష్ణపట్నం విద్యుత్ తమదేనని ఏపీ వాదించగా, తమకూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీంతో రాతపూర్వకంగా అభిప్రాయాలు ఇవ్వాలని సీఈఏ సూచించింది.
ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్, తూర్పుగోదావరి జిల్లాలోని సీలేరు జల విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఇచ్చేది లేదని ఆంధ్ర జెన్కో, ట్రాన్స్కో అధికారులు తెలంగాణకు తేల్చి చెప్పారు. అయితే, విభజన చట్టంలోని స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ను సరఫరా చేయకపోవడం దారుణమని తెలంగాణ విద్యుత్ శాఖ పేర్కొంది.
కాగా, వాటాల విషయంలో వచ్చే నెల మళ్లీ సమావేశమవుదామని సీఈఏ ప్రకటించింది. ఈ సమావేశంలో ఏపి తరఫున ట్రాన్స్కో సిఎండి విజయానంద్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్యదర్శి అరవింద్ కుమార్ హాజరయ్యారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారని, ఇందులో తెలంగాణకు న్యాయంగా 52 శాతం వాటా వస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ సిఇఏకు తెలిపింది. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నా, బొగ్గు లింకేజి లేదనే వంకతో ఉత్పత్తి నిలిపివేశారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న సీలేరు, విభజన తర్వాత ఆంధ్రలో విలీనమైందని, ఇక్కడ జల విద్యుత్లో తమ వాటా ఇవ్వడం లేదన్నారు. కృష్ణపట్నంపై పీపీఏ లేదని ఏపీ విద్యుత్ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. గతంలో జెన్కో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముసాయిదా ప్రతిపాదనలు చేస్తే ఏపీఈఆర్సీ విచారణ జరపలేదన్నారు.
ప్రస్తుతం భౌగోళికంగా ఏపీలో ఉన్న కృష్ణపట్నం విద్యుత్ తమ రాష్ట్ర అవసరాలకే సరిపోతుందన్నారు. పైగా జనాభా ప్రాతిపదికన అన్నింటినీ కేంద్రం విభజించిందని, కాని విద్యుత్ వచ్చేసరికి వినిమయం ఆధారంగా పంపకాలు చేయడం వల్ల ఆంధ్రకు తీరని నష్టం వాటిల్లుతోందని ఏపి విద్యుత్ శాఖాధికారులు తేల్చి చెప్పారు.
తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కూడా తమకు న్యాయపరంగా 46 శాతం విద్యుత్ రావాల్సి ఉందని, కాని సరఫరా చేయడం లేదని ఏపీ విద్యుత్ శాఖ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖాధికారులు తమ వాదనలు వినిపించిన తర్వాత సీఈఏ మరో నెల రోజుల తర్వాత సమావేశమవుదామని ప్రకటించారు.
మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అవసరమైతే కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు నుండి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ఏ సమస్యలైనా చర్చలతో పరిష్కారమవుతాయన్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామంటారని, ఢిల్లీలోనేమే ఏపీ అధికారులు విద్యుత్ ఇవ్వలేమని చెబుతారని, ఇదేం ద్వంద వైఖరి అని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.