అదృశ్యమైన రియల్టర్ శవం లభ్యం: హత్య చేశారా?
హైదరాబాద్: అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం ఎట్టకేలకు నగర శివారులోని బ్రాహ్మణపల్లిలో లభించింది. అనుమానాస్పద స్థితిలో కాలిపోయి రెండు భాగాలుగా విడిపోయిన మృతదేహం లభించింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఇంజమూరు గ్రామానికి చెందిన అలుగుపల్లి వెంకట్రెడ్డి(45) పదిహేనేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బిఎన్రెడ్డినగర్ టీచర్స్ కాలనీలో ఉంటున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ వినాయక రియల్ ఎస్టేట్ అధినేత సామ గణేశ్రెడ్డి వద్ద ఏజెంట్గా పనిచేస్తున్నాడు. 2012లో రాగన్నగూడలో గణేశ్రెడ్డి వెంచర్ను ప్రారంభించాడు. గణేశ్రెడ్డి వద్ద ప్లాట్ కొనుగోలు చేసిన వెంకట్రెడ్డి తన సోదరికి అమ్మాడు. అదే ప్లాటు తనకే ముందు రిజిస్ట్రేషన్ అయిందని హబ్సిగూడకు చెందిన చారి పేర్కొంటున్నాడు. అప్పటి నుంచి గణేశ్రెడ్డి, చారిలతో వెంకట్రెడ్డికి ప్లాటు విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

మొదటి రిజిస్ట్రేషన్ తనదేనని వెంకట్రెడ్డి తనతో గొడవకు వస్తున్నాడని నెల రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో చారి ఫిర్యాదు చేశాడు. రెండో రిజిస్ట్రేషన్ అని తెలుసుకున్న వెంకట్రెడ్డి తనకు మరో ప్లాటు ఇవ్వాలని గణేశ్రెడ్డిని కలిసినప్పటికీ స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్రెడ్డి ఈనెల 1న తనకు అమ్మిన ప్లాటు వద్ద కారు నిలిపి వెళ్లిపోయాడు.
కారులో ఉన్న డైరీలో తాను చనిపోతున్నానని తన చావుకు సామ గణేశ్రెడ్డి, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాల కృష్ణమూర్తి, చారి కారణమని, ఇన్స్పెక్టర్ బెదిరించాడని రాసిపెట్టి ఉంది. కారు నిలిపిన వంద మీటర్ల దూరంలోనే ఆదివారం వెంకట్రెడ్డి మృతదేహం లభించింది. పథకం ప్రకారమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడనికి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చారని వెంకట్రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ఏసిపిలు ఆనంద్ భాస్కర్, సురేందర్రెడ్డి పూర్తి వివరాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications