Pawan Kalyan : పవన్ 30-40 కామెంట్స్ వెనుక అసలు రీజన్ ఇదే.. ?
ఏపీలో వైసీపీని ఎలాగైనా ఓడించి తీరుతామనని మరోసారి శపథం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మాత్రం తొలిసారి కొత్త వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో పొత్తు ఉంటుందని మరోసారి తేల్చిచెప్పిన పవన్.. ప్రస్తుతం తన పరిస్ధితిని జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలకు సైతం గుర్తుచేశారు. అదే సమయంలో కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామిలా ఉండి ఉండే సీఎం అయ్యే ఛాన్స్ వచ్చేందంటూ పోల్చుకున్నారు.
ఏపీలో వైసీపీని ఓడించేందుకు టీడీపీతో సీట్ల సర్దుబాటు, పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం సీటు ఇస్తేనే పొత్తు ఉంటుందంటూ టీడీపీ, బీజేపీని డిమాండ్ చేయాలని కోరుతున్న వాళ్లకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుత పరిస్ధితుల్లో తాను ఆ డిమాండ్ వారి ముందు పెట్టలేనన్నారు. కర్నాటకలో కుమారస్వామిలా 30-40 సీట్లు గెల్చుకుని ఉంటే రాబోయే ఎన్నికల్లో తనకు సీఎం పదవి కావాలని టీడీపీ, బీజేపీని డిమాండ్ చేసే వాడినన్నారు.

పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి. గత కొంత కాలంగా టీడీపీ-జనసేన పొత్తుపై క్షేత్రస్ధాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో జనసేన నేతలతో పాటు కాపు నేతలు కూడా సీఎం పదవి ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సీఎం అయ్యే ఛాన్స్ లేకపోవడంతో టీడీపీతో పొత్తు తప్పనిసరని పవన్ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ జనసేనలో నేతలతో పాటు కాపు నేతల్ని బుజ్జగించేందుకే ఈ 30-40 సీట్ల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ తనకు స్వతహాగా సీఎం పదవి ఇవ్వవంటూ కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో తాను నిరూపించుకున్న తర్వాతే సీఎం పదవి వెతుక్కుంటూ వస్తుందని, ఆ లోపు వెంపర్లాడేది లేదంటూ పవన్ క్లారిటీ ఇచ్చేశారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో సీఎం పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలన్న డిమాండ్ వద్దంటూ తన మద్దతుదారులకు పవన్ చెప్పినట్లయింది.












Click it and Unblock the Notifications