పోరాడాల్సిన చోట జగన్ మౌనం- కొత్త అనుమానాలకు ఊతం....కేసీఆరే బెటరా... ?
గతంలో సీఎం పదవిని వారసత్వంగా తనకు కట్టబెట్టలేదని కాంగ్రెస్ అధినాయకత్వాన్నే ధిక్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ల తర్వాత అదే పదవిని పోరాడి సాధించుకున్నారు. ఈ పదేళ్లలో ఆయన చూపిన తెగువ, పోరాట పటిమ సాధారణ ఓటరుపై సైతం విశేష ప్రభావాన్ని చూపాయి. కానీ అదే జగన్ అధికారం చేపట్టిన తర్వాత చాలా విషయాల్లో పోరాటానికి బదులు రాజీమార్గాన్ని ఎంచుకుంటున్నారనే వాదన పెరుగుతోంది. తాజాగా ఆయన చర్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

విస్పష్ట వైఖరే జగన్ బలం...
వైఎస్ జగన్ అంటేనే విస్పష్ట వైఖరి. గతేడాది ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రత్యర్ది చంద్రబాబు అధికారానికి దూరంగా ఉండిపోవడానికి కారణం కూడా అదే స్పష్టత. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేందుకే జగన్ ప్రాధాన్యమిస్తారని ఆయన గురించి ఎక్కువగా తెలిసిన వారంతా చెప్పేమాట. కానీ తాజాగా అధికారం చేపట్టిన తర్వాత జగన్ వైఖరిలో మార్పు కనిపిస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు తాను కీలకంగా భావించిన, గట్టిగా మాట్లాడిన అంశాలపై కొంతకాలంగా మౌనం వహించడమే ఇందుకు గల కారణం.

విద్యుత్ బిల్లు రూపంలో కేంద్రం ముకుతాడు...
దేశ విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు చేపట్టాలని చూస్తున్న కేంద్రానికి పీపీఏలు, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ప్రభుత్వాలు కుదుర్చుకున్న పీపీఏలను ఏపీలోని వైసీపీతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని పక్కనబెడితే విద్యుత్ రంగంలో ప్రభుత్వాలను నమ్మి పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్ధలు ఇబ్బందులు పాలు కాక తప్పడం లేదు. ప్రైవేటీ కరణ కూడా ఇదే కోవలోకి వస్తుంది. తమకు అనుకూలంగా ఉన్న సంస్ధల చేతిలో పగ్గాలు లేవన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకోవడం ద్వారా ప్రైవేటు సంస్ధల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అంతిమంగా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్న ప్రైవేటు సంస్ధలకు ప్రభుత్వాలపై నమ్మకం లేకుండా పోతోంది. అందుకే వీటికి ముగింపు పలికేందుకు కేంద్రం తాజాగా పార్లమెంటులో విద్యుత్ చట్టంలో సవరణలు చేస్తూ కొత్తగా బిల్లు ప్రవేశపెట్టింది.

బిల్లు ఆమోదం పొందితే జగన్ కు చిక్కులే...
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే ఓసారి ప్రభుత్వాలు ఆమోదించిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు ఎవరికీ అధికారం ఉండదు. అలాగే ప్రైవేటు సంస్ధలకు కాంట్రాక్టులు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారం కూడా కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. అలాగే రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు ఛైర్మన్, మెంబర్లను నియమించే అధికారం కూడా కేంద్రం సొంతమవుతుంది. అంటే అంతిమంగా ఏ రాష్ట్రంలో విద్యుత్ ధరలు ఎంత ఉండాలో కేంద్రమే నిర్ణయిస్తుందన్నమాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్రం కైంకర్యం చేయడమే అవుతుంది. దీంతో సహజంగానే ఇది పీపీఏలను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుతో పాటు తెలంగాణ వంటి విపక్ష పార్టీలు అధికారం ఉన్న రాష్ట్రాలకూ మంట పుట్టిస్తోంది. అందుకే కేసీఆర్ ఈ వ్యవహారంలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో ఈ బిల్లులో పలు అంశాలు జగన్ కూ ఇబ్బందికరమే అవుతాయి.

అయినా జగన్ మౌనం... రాజీ బాట తప్పదా ?
వైసీపీ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు ప్రజలకు చౌకగా విద్యుత్ అందించేందుకు తీసుకుంటున్న పలు నిర్ణయాలకు విఘాతం కలిగించేలా ఉన్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై సాధారణంగా అయితే సీఎం జగన్ వ్యతిరేకించాలి. కానీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి నెల రోజులు కావస్తున్నా వైసీపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీనికి కారణం ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారుతో జగన్ నెరుపుతున్న సత్సంబంధాలే అని చెప్పక తప్పదు. అయితే ఏ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో విదేశీ సంస్ధలను, హైకోర్టును, బలమైన పవర్ లాబీని సైతం ఢీకొని మరీ పీపీఏలను జగన్ వ్యతిరేకించారో.. ఇప్పుడు అవే ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే జగన్ మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయినా ప్రస్తుత పరిస్దితుల్లో మోడీ వ్యతిరేక వైఖరి తీసుకోవడం సబబు కాదనే కోణంలో జగన్ ఇంత కీలకమైన అంశంపైనా మౌనం వహించక తప్పని పరిస్ధితి.

కేసీఆర్ మాట్లాడుతున్నా.. జగన్ మాత్రం...
కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణలోని కేసీఆర్ సర్కారు గుర్రుగా ఉంది. రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించి తీరుతామని సీఎం కేసీఆర్ తాజాగా కుండబద్దలు కొట్టారు. అయితే చాలా అంశాల్లో కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్న జగన్... తన విధానానికి సైతం వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ బిల్లుపై మాత్రం నోరు మెదపలేని పరిస్ధితి నెలకొనడం భవిష్యత్తులో ఇబ్బందులు తీసుకురావచ్చనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తో పాటు మిగతా రాష్ట్రాల సీఎంలు సైతం దీనిపై మాట్లాడటం ప్రారంభిస్తే అప్పుడు జగన్ వైఖరిని కూడా బయటపెట్టాలని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేసే అవకాశముంది. అప్పుడు దీనిపై స్పందించక తప్పని పరిస్దితి జగన్ కు ఎదురవుతుంది.
-
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!











Click it and Unblock the Notifications