జడ్జీల విచక్షణాధికారంతోనే: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు కంప్లైంట్ చేస్తా: రఘురామ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ సీఎం స్టిక్కర్ల కార్యక్రమాన్నీ తప్పుపట్టా
అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వైసీపీ పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని తమ పార్టీ సభ్యులు నిలదీయలేకపోతున్నారని తప్పుపట్టారు. దీనికి కారణం- వారిపై ఉన్న కేసులేనని ఆరోపించారు.

విచక్షణతోనే బెయిల్..
ఢిల్లీలోని తన నివాసంలో ఇవ్వాళ విలేకరులతో మాట్లాడారు. 32 ఆర్థిక కేసుల్లో నిందితులుగా కేసులను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి న్యాయమూర్తులు తమ విచక్షణాధికారంతోనే బెయిల్ మంజూరు చేశారని అన్నారు. అలాంటిది న్యాయ వ్యవస్థను కించపరిచేలా విజయసాయి మాట్లాడటం సరికాదని అన్నారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందంటూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు.

సుప్రీంకోర్టును హెచ్చరించారా?
హైకోర్టు ఎటూ తప్పు చేసిందని, ఇక సుప్రీంకోర్టయినా సరిగ్గా వ్యవహరించాలని విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టును పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా? అంటూ రఘురామ ప్రశ్నించారు. రాజధానుల ఏర్పాటు నిర్ణయాధికారం శాసనసభకే ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరుతూ, గతంలో ఇదే రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారని, ఇప్పుడు మాటమార్చి, రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

ఆ విషయం సుప్రీంకు చెప్పండి..
రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే, ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని రఘురామ డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవమానపరిచేలా మాట్లాడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తానని అన్నారు.

ప్రభుత్వం దిగిపోయాక..
తమ తాతలు, తండ్రులు కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మలెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామ అన్నారు. ఈ ప్రభుత్వం దిగిపోయాక ఈ పాస్ పుస్తకాలను ఓ మూలన పడేయడం ఖాయమని చెప్పారు. ప్రజల ఆస్తి పత్రాలపై యజమానుల ఫోటోలే ఉంటాయని విశ్వసిస్తున్నానని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు.

పచ్చబొట్టు పథకం..
జగనన్న ఇంటింటికి స్టిక్కర్ పథకం పై రఘురామ అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్టిక్కర్ ను తొలగించే వారికి సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని, అలాగే పింఛన్ సొమ్మును చెల్లిస్తున్నప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేస్తామని లబ్దిదారులతో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోందని రఘురామ ఆరోపించారు. ఇది మరింత ముదిరితే జగనన్న పచ్చబొట్టు పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

జీతాలపై..
ప్రభుత్వ ఉద్యోగులలో చాలామందికి ఇప్పటివరకు జీతాలు అందలేదని రఘురామ అన్నారు. ముఖ్యమంత్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పురత్న అని పేరు పెట్టారని, దీన్ని కొద్దిగా మార్చి రుణ రత్న అని పేరు పెడితే బాగుంటుందని సూచించారు. ఇక ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉడతా భక్తిగా రణరత్న అనే బిరుదును ప్రదానం చేస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications