సీఎం జగన్ ను వెంటాడుతున్న రఘురామ-హైకోర్టులో మరో పిటీషన్ : ఈడీ..ఐటీ అసమగ్రంగా..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు..సీఎం జగన్ లక్ష్యంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేయగా..దానిని న్యాయస్థానం తిరస్కరించింది. సీఎం జగన్ అక్రమాస్తులపై పూర్తి స్థాయిలో దర్యాపునకు ఆదేశించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ఈ పిల్ వేశారు. సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని అందులో పేర్కొన్నారు. విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని తన పిటీషన్ లో వివరించారు.
రఘురామ పిల్..ధర్మాసనం విచారణ..
గతేడాది దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది మాదాసు భరత్చంద్ర వాదనలు వినిపించారు.
పిటిషన్లో ఆరోపణలు చేసిన వ్యక్తులను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని, ఆరోపణలపై వారి వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీని పైన పిటీషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ..గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం లేదని..ఆ తీర్పు కాపీని అందిస్తామని చెప్పారు. ఈ విషయం పైన రిజిస్ట్రీ సమాచారం ఇవ్వలేదని, ఏడాదినుంచి రిజిస్ట్రీ నెంబరు కేటాయించలేదని వివరించారు.
విచారణార్హతపై ఉత్తర్వులిస్తామంటూ వాయిదా..
వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్ విచారణార్హతపై ఉత్తర్వులిస్తామంటూ వాయిదా వేసింది. అయితే, రఘురామ తన పిటీషన్ లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ.. విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి వదిలేసిందని వివరించారు.
2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్ 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. హౌరా, కోల్కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు జగతిలోకి వచ్చాయని, వీటిపై దర్యాప్తును ఐటీ, ఈడీలకు లేఖ రాయటంతో సరిపెట్టిందన్నారు.
ఈడీ..ఐటీ అసమగ్రంగా విచారణ చేసాయంటూ..
ఆర్వోసీ జగన్కు చెందిన కంపెనీల వ్యవహారాలను పట్టించుకోలేదని, తనిఖీలు చేసి తయారుచేసిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోలేదని, వాటిపై దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటీషన్ లో కోరారు. 2012-14 మధ్య 11 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టలేదని, డిశ్ఛార్జి పిటిషన్ల పేరుతో జాప్యం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు.
ఈ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఏ సంస్థల నుంచి వచ్చాయనే వివరాలను రఘురామ తన పిటీషన్ లో వివరించారు.