భయంగా ఉంది: నీతూ అగర్వాల్, కడపకు బదానియా
కడప/కర్నూలు: ఎర్రచందనం కేసు నిందితురాలిగా ఉన్న హీరోయిన్ నీతూ అగర్వల్ ఆదివారం నాడు కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తానింకా భయాందోళనలోనే ఉన్నానని, స్మగ్లర్లు తనని టార్గెట్ చేశారని చెప్పారు.
తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనని చంపేందుకు కుట్ర జరుగుతోందని, ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తనని అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, తాను నిర్థోషిగా బయటపడతానన్నారు.
హర్యానాలోని హిస్సార్లో ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానియాను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పోలీసులు కడపకు తీసుకు వస్తున్నారు. ట్రాన్సిట్ వారెంటు పైన బదానియాను తీసుకు వస్తున్న పోలీసులు కడప కోర్టులో సోమవారం హాజరుపర్చనున్నారు.
బదానియాను విచారించడం ద్వారా చాలామంది స్మగ్లర్ల విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాల బడా స్మగ్లర్లతో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
బదానియా చిత్తూరు, కడప జిల్లాలను టార్గెట్ చేసుకుని స్మగ్లింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. స్మగ్లర్ గంగిరెడ్డి కంటే బదానియాకు నెట్వర్క్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్లతో కూడా బదానియాకు మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు.