ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్టు: విదేశాలతో లింక్
తిరుపతి: శేషాచల అటవీ సంపదను కొల్లకొడుతూ ఎర్ర చందనం విదేశాలకు తరలిస్తున్న బడా స్మగ్లర్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని చెన్నయ్ కి చెందిన కందస్వామి వెంకటేష్ (42) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వెంకటేష్ తన అనుచరులతో కలిసి శేషాచల అటవి ప్రాంతంలో ఎర్ర చందనం చెట్లు నరికివేస్తున్నారని అన్నారు. తరువాత ఎర్ర చందనం దుంగలను గుట్టుచప్పుడు కాకుండ విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు.
గత జనవరి 28వ తేదీన ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న సమయంలో మామండూరు అటవీ ప్రాంతంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారని గోపినాథ్ జెట్టి అన్నారు. ఆ సందర్బంలో వెంకటేష్ అతని అనుచరులు పోలీసుల మీద రాళ్లు, కత్తులతో దాడులు చేసి అక్కడి నుండి పారిపోయారని చెప్పారు.
చెన్నయ్ లోని మౌంట్ రోడ్డులోని పాస్ పోర్టు కార్యాలయంలో వెంకటేష్ ఉన్నాడని కచ్చితమైన వివరాలు లభించడంతో అతనిని అరెస్టు చేశామని అన్నారు. చిత్తూరు, కడప జిల్లాలలో వెంకటేష్ మీద 10కి పైగ స్మంగ్లింగ్ కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.
దుబాయ్ లో ఉంటున్న అంతర్జాతీయ స్మంగ్లర్ సాహుల్ హమీద్ తో వెంకటేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎర్ర చందనం విదేశాలకు తరలించిన వెంకటేష్ రూ. కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడని చెప్పారు. న్యాయస్థానం అనుమతితో ఆగస్టు 12వ తేది వరకు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్పీ గోపినాథ్ జెట్టి వివరించారు.