స్మార్ట్ స్మగ్లర్స్: పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్రచందనం అక్రమ రవాణా
చిత్తూరు:ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసుల నిఘా పెరిగేసరికి తమ దందా కొనసాగించేందుకు ఎర్ర చంద్రనం స్మగ్లర్లు కొత్త ప్లాన్ వేశారు.
పార్థీ గ్యాంగ్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు అడ్డం పెట్టుకొని తాము గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు ప్లాన్ వేశారు. అయితే చివరకు
ఈ కంత్రీ స్మగ్లర్ల ప్లాన్ ను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగర్లపై దాడి చేసి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రోజు వారి తనిఖీల్లో భాగంగా అటవీ శాఖ సిబ్బంది తారకరామానగర్, గుండాలకోన వద్ద గస్తీ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం గ్రామం వద్ద పార్థీ గ్యాంగ్ ఉన్నట్లు అలజడి రేగడంతో గ్రామశివారుల్లో ఉన్న మరో టీంకు ఆ విషయం సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టాక అక్కడ ఉన్న దుండగులు పార్థీ గ్యాంగ్ సభ్యులు కాదని, ఎర్రచందనం దొంగలని నిర్ధారించుకున్నారు.
దీంతో మొదటి బృందానికి ఇదే విషయం సమాచారం అందించి సాయుధ సిబ్బందితో కలసి పోలీసులు రెండు బృందాలుగా చీలి వారిని వెంబడించారు. దీంతో ఎర్ర స్మగ్లర్లు తమ వద్దనున్న దుంగలను అక్కడే పడేసి గుండాల కోన నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. దీంతో పోలీసులు 675 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 20 రోజులుగా పరిసర ప్రాంతాల్లో పార్థీ దొంగలు తిరుగుతున్నారంటూ గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతున్నందున తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని శ్రీనివాసపురం, తారకరామానగర్ వాసులు ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలిపారు.












Click it and Unblock the Notifications