కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా నష్టం లేదు, రిజిస్ట్రేషన్లు సులభతరం: కెఈ
విజయవాడ: కాపులకి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ బీసీలకు ఎలాంటి నష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మంగళవారం నాడు అన్నారు. అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల పైన కమిటీ నివేదిక ఇచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆయన విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ శాఖలోని సేవలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇప్పటికే ఎన్నారై రిజిస్ట్రేషన్లను సులభతరం చేశామని తెలిపారు. రూ.వెయ్యిపైన స్టాంపులను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో రూ.3,500 కోట్ల లక్ష్యంగా నిర్దేశించికున్నట్లు ఈ సందర్భంగా కెఈ చెప్పారు.
కాగా, కాపుల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాపుల్లో పేదరికంలో ఉన్నవారిని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు ఉద్ధేశించిన ఈ కార్పొరేషన్కి రూ.100 కోట్లతో నిధిని సమకూర్చడానికి ఆమోదం తెలిపింది.
సోమవారం ఉదయం విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కాపులను బీసీల్లో చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ వేయాలని నిర్ణయించారు.
ర్యాలీని ప్రారంభించిన సభాపతి కోడెల, మంత్రి పల్లె రఘునాథరెడ్డి
గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం శత వసంత ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఏపీ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాద రావు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ప్రజలందరినీ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడంలో భాగంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో నరసరావుపేట పురపాలక సంఘం శత వసంత ఉత్సవాలు నిర్వహించనున్నారు.