ఎసిబి వలలో పెద్ద చేప: అతని అక్రమాస్తుల విలువ రూ. 15 కోట్లు
విజయవాడ: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి కార్యాలయంలోని సూపరింటిండెంట్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కాడు. ఆదాయానికి మించిన అస్తులు ఉన్నాయనే ఆరోపణపై ఆయనను ఎసిబి అధికారులు మంగళవారంనాడు అరెస్టు చేశారు.
సబ్ రిజిస్ట్రార్ ర్యాంక్లో ఉన్న అధికారి పి. వేణు వెంకట దుర్గా ప్రసాద్ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.39 కోట్లు ఉంటాయని అంచనా. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారం అందడంతో ఎసిబి డిఎస్పి వి. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.
తన అక్రమాస్తుల రక్షణ కోసం అతను సోదరిని, బావను బినామీలుగా వాడుకున్నట్లు ఎసిబి అధికారులు తేల్చారు. సబ్ రిజిస్ట్రార్ సోదరి ఎ. వెంకటలక్ష్మి, ఆమె భర్త ఎ. బాల సత్యరామ్ ప్రసాద్ పేర్ల మీద రూ.2.59 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గోపాల గోపాలకృష్ణ చెప్పారు.

విజయవాడలోని గుండాలలో ఏడేళ్లుగా ఆన పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే అతను అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. బాల సత్యరామ్ ప్రసాద్ డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. బాలసత్యరామ్ ప్రసాద్ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉందని, తెల్ల రేషన్ కార్డు ఉన్న అతనికి అంత ఆస్తి ఉండే అవకాశం లేదని, అంతేకాకుండా ఓ డాక్యుమెంట్ రైటర్ అంతగా సంపాదించే అవకాశం లేదని గోపాలకృష్ణ అన్నారు.
ప్లాట్లు, ఇళ్ల వంటి ఆస్తులన్నీ వేణు వెంకట దుర్గా ప్రసాద్ పనిచేసిన పట్టణాల్లో, నగరాల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. అతనికి బ్యాంక్ కాలనీలో ఓ ఇల్లు, భారతినగర్లో రెండు ఫ్లాట్స్, కరెన్సీ కాలనీలో ఓ ఇంటి స్థలం, ఏలూరులోని వన్ టౌన్, పవర్ పేటల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, ఏలూరు సమీపంలోని చాటపర్రులో 10 ఎకరాల స్థలం ఉన్నాయని, వాటి విలువ బహిరంగ మార్కెట్లో 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు.
వేణు వెంకట దుర్గాప్రసాద్ను ఎసిబి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన భార్య ప్రభుత్వ జూనియర్ లెక్చరర్.












Click it and Unblock the Notifications