కరోనా: మాజీ ఎంపీ కుటుంబంలో విషాదం.. అమెరికా నుంచి మృతదేహాన్ని తేలేక..
కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 11లక్షలు దాటింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు వెయ్యిమంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 65వేలకు పెరిగింది. ఏ దశలోనూ వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోయినా, అక్కడి రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేసి, బిజినెస్ లను పున:ప్రారంభించాయి. అమెరికాలో కొవిడ్ కాటుకు చనిపోయినవాళ్లలో 40 మందికిపైగా భారతీయులు ఉన్నారు.
అమెరికాలో ఉంటోన్న బంధువొకరు కొవిడ్-19 కారణంగా చనిపోవడంతో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. కొండా కజిన్ సిస్టర్ భర్త.. కొవిడ్ తో పోరాడుతూ, శుక్రవారం ఐసీయూలో కన్నుమూశారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే మార్గం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు.
అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతుండటంతో అక్కడి భారతీయుల పట్ల ఇక్కడున్నవారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మాజీ ఎంపీ కొండా కుటుంబీకుడితో కలిపి ఇప్పటిదాకా అమెరికాలో కొవిడ్-19 కారణంగా చనిపోయిన భారతీయుల సంఖ్య 40 దాటింది. వాళ్లలో కొందరు అక్కడే శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నవాళ్లుకాగా, మిగతా వాళ్లు వీసాలపై పనిచేయడానికి వెళ్లినవాళ్లని భారతీయ సంఘాలు తెలిపాయి. ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, ఆ ప్రాంతాల్లోనే భారతీయులు ఎక్కువగా నివసిస్తుండం గమనార్హం. ఇప్పటిదాకా చనిపోయినవారిలో 17 మంది కేరళకు,10 మంది గుజరాత్ కు చెందినవాళ్లుకాగా, ఏపీకి చెందిన ఒకరు, తెలంగాణకు చెందిన మరోకరు చనిపోయారు.