జగన్ విడుదల: జైలు నుండి ఇంటి దాకా, జనమే జనం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
జగన్ 485 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు. జగన్ విడుదల అవుతుండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, వైయస్ జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు జైలు వద్దకు వచ్చారు. జగన్ బయటకు వచ్చినప్పుడు ఒక్కసారిగా అభిమానులు ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేశారు.

జగన్ విడుదల జైలు నుండి ఇంటి వరకు
జైలు నుండి సాయంత్రం మూడు గంటల నలభై అయిదు నిమిషాలకు జగన్ చంచల్ గూడ నుండి బయటకు వచ్చారు.
ప్రధాన ద్వారం నుండి జగన్ బయటకు వచ్చారు. వస్తూనే కార్యకర్తలకు నవ్వుతూ అభివాదం చేశారు.
బయటకు వచ్చిన జగన వాహనం కోసం వేచి ఉన్నారు.
జగన్ దళసరి రంగు ఉన్న తెల్లని చొక్కా ధరించారు.
జైలు వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు గుమికూడారు. కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. జై జగన్ నినాదాలతో జైలు ప్రాంగణం మారుమోగింది. జగన్తో కరచాలనానికి పోటీపడ్డారు. జైలు వద్ద కొద్దిగా తొక్కిసలాట జరిగింది.
జగన్కు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.
భారీ భద్రత మధ్య జగన్ జైలు నుండి ఇంటికి బయలుదేరారు.
జగన్ వాహనం వెళ్తుండగా రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులుతీరారు. జగన్ ఇంటికి వచ్చే రహదారి కిక్కిరిసిపోయింది.
నాలుగు గంటల పదిహేను నిమిషాలకు జగన్ కాన్వాయ్ నల్గొండ క్రాస్ రోడ్డు సమీపానికి చేరుకుంది.
జాతీయ వార్తల్లో జగన్ విడుదల ప్రధానం అంశమైంది.
రోడ్డు కిరువైపుల కిక్కిరిసిన అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు.
నాలుగున్నర గంటల ప్రాంతంలో జగన్ కాన్వాయ్ నల్గొండ క్రాస్ రోడ్డు దాటింది.
జగన్ కాన్వాయ్ చాలా నెమ్మదిగా వెళ్తోంది. అభిమానులు వాహనం వెంట నడిచారు.
ముందు సీట్లో కూర్చున్న జగన్ కారు డోరు తెరిచి నిలబడుతూ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు.
జగన్ విడుదలై ఇంటికి వస్తుండటంతో బంధువులు, పార్టీ కార్యకర్తలు లోటస్ పాండుకు తరలి వచ్చారు. ఎస్వీ సుబ్బారెడ్డి, భూమా నాగి రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు తదితరులు చేరుకున్నారు.
అభిమానులు రోడ్డు కిరువైపులా గుమికూడటంతో రెండు కిలోమీటర్లు దూరం సాగేందుకు జగన్ కాన్వాయ్కు గంటకు పైగా సమయం పట్టింది.
ఐదు గంటలు దాటిన తర్వాత జగన్ కాన్వాయ్ చాదర్ఘట్ దాటింది.
జగన్ కాన్వాయ్ ఐదుంపావుకు మొజంజాహి మార్కెట్కు చేరుకుంది.
జగన్ పలుచోట్ల వాహనం దిగి అభివాదం చేశారు. ఎంజె మార్కెట్ వద్ద అభిమానులు పూలు బహూకరించారు.
కాన్వాయ్ నాలుగున్నర గంటలకు గాంధీ భవన్ వద్దకు చేరుకుంది. జగన్ రెండు చేతులు జోడించి అభిమానులకు అభివాదం చేశారు.
కాన్వాయ్ నాలుగు కిలోమీటర్లు సాగేందుకు గంటన్నర సమయం తీసుకుంది.
ఐదు గంటల యాభై నిమిషాలకు లక్టీకాపూల్ సెంటర్కు జగన్ కాన్వాయ్ చేరుకుంది.
ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటల సమయం తీసుకుంది.
లక్టీకాపూల్లో జగన్కు స్వాగతం పలికేందుకు లంబాడీ మహిళలు వచ్చారు. వారు ఆటా-పాటలతో అలరించారు.
జగన్ కోసం రాష్ట్ర ప్రజలు తమ సొంత బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి లోటస్ పాండు వద్ద అన్నారు. జగన్ బయట ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు అనుకుంటున్నారన్నారు. వైయస్ చనిపోయాక రాష్ట్రం ఇబ్బంది పడుతోందని, వైయస్ లాంటి నాయకుడిని జగన్లో ప్రజలు చూసుకుంటున్నారని చెప్పారు.
ఆరు గంటల ఇరవై నిమిషాలకు జగన్ కాన్వాయ్ లక్డీకాపూల్ సెంటర్ దాటింది.
ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కాన్వాయ్ ఖైరతాబాద్ చేరుకుంది.
దాదాపు ఏడు గంటల సమయంలో జగన్ కాన్వాయ్ ఖైరతాబాద్ను దాటింది.
మంగళవారం రాత్రి 9 గంటల 20 నిమిషాలకు జగన్ తన లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి దాకా జగన్ వెంట అభిమానులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.












Click it and Unblock the Notifications