ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, ముద్రగడకు భారీ ఊరట-తుని రైలు దహనం కేసు కొట్టేసిన కోర్టు..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన పోరులో భాగంగా అప్పటి తూర్పుగోదావరి జిల్లా తునిలో అల్లరి మూకలు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును తగులబెట్టారు. ఈ కేసుపై ఐదేళ్ల పాటు విచారణ జరిపిన విజయవాడ రైల్వే కోర్టు ఇవాళ దాన్ని కొట్టేసింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు కాపు నేత ముద్రగడ పద్మనాభానికి విముక్తి లభించింది.
తుని రైలు దహనం ఘటనపై నమోదన కేసులో ఇవాళ తీర్పు ప్రకటించిన విజయవాడ రైల్వే కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసంది. ఈ కేసుపై ముగ్గురు రైల్వే ఉన్నత అధికారులు సరిగ్గా విచారణ చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్లు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఈ కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదని స్పష్టం చేసినట్లయింది.

2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ల హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ కాపు సంఘాలు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఛలో తునికి పిలుపు ఇచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. చివరికి ఆ సమయంలో అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్న ఆందోళనకారులు.. చివరకు దానికి నిప్పంటించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
తుని రైలు దహనం ఘటనపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. అయినా రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వైసీపీ నేత దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా 41 మంది నేతలపై విచారణ సాగింది. ఈ కేసులో పలుమార్లు వీరంతా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. చివరకు అధికారులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని భావించిన రైల్వే కోర్టు.. సరైన సాక్ష్యాలు లేని కారణంగా కేసు కొట్టేసింది. దీంతో వీరందరికీ విముక్తి లభించింది.












Click it and Unblock the Notifications