జంతర్ మంతర్ నుంచి వెళ్లేది లేదు..! భీష్మించిన కాక్రోచ్ లు..!
నీట్ సహా పలు జాతీయ స్దాయి పరీక్షల్లో చోటు చేసుకుంటున్న వరుస తప్పిదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ మరో సంచలన ప్రకటన చేసింది. ఇవాళ రెండోసారి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టిన కాక్రోచ్ లు.. కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకూ అక్కడి నుంచి కదలబోమని ప్రకటించారు. ఈ మేరకు కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) సంచలన ప్రకటన చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే షరతుతో ఇవాళ మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. సాయంత్రానికి స్వరం పెంచింది. ఓవైపు చర్చల కోసం ప్రభుత్వం మార్గం సుగమం చేయాలని కోరుతున్న కాక్రోచ్ లు.. మరోవైపు జంతర్ మంతర్ వద్ద తమకు అనుమతిని పొడిగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వచ్చాకే తాము తాము జంతర్ మంతర్ వీడుతామని అభిజిత్ దిప్కే తేల్చిచెప్పేశారు. దీంతో ఇప్పుడు పోలీసుల్లో టెన్షన్ మొదలైంది.

ఇప్పటికే ఢిల్లీతో పాటు పూణే, బెంగళూరు, హైదరాబాద్, అమృత్ సర్, జైపూర్ లో ఆందోళనలు నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్ పై మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే కేంద్రం మాత్రం కాక్రోచ్ ఆందోళనల్ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇవాళ మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి అడగ్గానే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము జంతర్ మంతర్ వద్ద నుంచి వెళ్తామని కాక్రోచ్ లు భీష్మించడంతో పోలీసులు ఏం చేయబోతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు బలప్రయోగం చేస్తే జరగబోయే పరిణామాలపై కూడా ఉత్కంఠ నెలకొంది.














Click it and Unblock the Notifications