డాలర్ల మాయం: డాలర్ శేషాద్రి నిర్దోషి, షరాబుకు జైలు
2006లో ఐదు గ్రాముల బరువు గల 300 డాలర్లు మాయమైన ఘటన అప్పటిలో సంచలనం కలిగించింది. ఈ కేసు పైన విచారణ చేపట్టిన సీబీసీఐడీ 2008లో తుది నివేదికను ఇచ్చింది. ఇప్పుడు న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు మరో నలుగురికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
కాగా, డాలర్ శేషాద్రికి నాలుగేళ్ల క్రితం క్లీన్ చిట్ దొరికింది. శేషాద్రి తిరుమల తిరపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలోని డాలర్లలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు నాడు తీర్పు చెప్పింది. దీనిపై ఆయన అప్పుడే విలేకరులతో మాట్లాడారు.
డాలర్ల మాయం విషయంలో తనను టార్గెట్ చేసి వెంకన్న ప్రతిష్టను దిగజార్చారన్నారు. తనకు క్లీన్ చిట్ రావటం పట్ల తన నిజాయితి అందరికీ తెలిసిందన్నారు. ఈ తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లా న్యాయస్థానం తుది తీర్పులోను ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా డాలర్ శేషాద్రి నియామకాన్ని గతంలో పొడిగించారు. ఆయన పొడిగింపు పైన న్యాయస్థానంకు కూడా వెళ్లిన వారు ఉన్నారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం ఆయన నియామకాన్ని సమర్థించింది. తిరుమల ప్రత్యేకాధికారిగా ఉన్న ఆయనకు అక్టోబర్ నెల ఒకటో తేదిన గుండెపోటు కూడా వచ్చింది. దీంతో కొద్దిరోజులు స్వామి వారి సేవకు దూరంగా ఉన్నారు. పదిహేను రోజుల తర్వాత ఆయన మళ్లీ స్వామివారి సేవకు హాజరయ్యారు.