చంద్రబాబుపై అలిపిరి బ్లాస్ట్ గుర్తుచేస్తూ.. మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోమారు మావోయిస్టుల వార్నింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి సీదిరి అప్పల రాజు పై మావోయిస్టుల లేఖ నేపథ్యంలో భద్రత పెంచిన విషయం తెలిసిందే. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూములు కబ్జా పెరుగుతోందని ఆరోపిస్తూ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ మావోయిస్టు కమిటీ పేరుతో లేఖ విడుదలైన విషయం తెలిసిందే. ఈ లేఖ పై తీవ్రంగా స్పందించిన మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, మరోమారు ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తూ మావోయిస్టులు మరో లేఖ రాయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
మంత్రి సీదిరి అప్పలరాజు టార్గెట్ గా మావోల మరోలేఖ
ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు పై పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయని మంత్రి అప్పలరాజు చెప్పడాన్ని తీవ్రంగా విప్లవ యువజన సంఘం కార్యదర్శి అశోక్ పేరుతో వచ్చిన లేఖలో ఖండించారు. గతంలో ఆంధ్ర ఒడిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరుతో లేఖ విడుదల కాగా, ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వైవియస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో మంత్రి అప్పలరాజు దుష్ప్రచారాన్ని మానుకోవాలని పేర్కొన్నారు .ఇక మంత్రికి వత్తాసు పలుకుతున్న చిక్కోలు జగదీశ్, జనం రమణలు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
మావోయిస్ట్ పార్టీపై మంత్రి వ్యాఖ్యలు దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట
మావోయిస్టు ప్రజాసంఘాల నాయకులుగా చలామణి అవుతున్న దుష్టచతుష్టయం మంత్రికి లోపాయికారిగా ఇస్తున్న సలహాలు, సూచనలు, సహకారాలు మానుకోవాలని లేఖ ద్వారా మావోయిస్టులు తెలిపారు. మంత్రి సీదిరి అప్పల రాజు ను టార్గెట్ చేసిన మావోయిస్టులు మంత్రి , అతని అనుచరులు చేస్తున్న భూదందాలు బయటపెట్టి వారు అక్రమంగా ఆక్రమించిన రామకృష్ణాపురం, సూది కొండ, నెమలి కొండ తదితర భూముల నుండి తక్షణమే వైదొలగాలని, ఆ భూములు ఈ ప్రాంత పేద ప్రజలకు చెందాలని ప్రజల తరఫున మాట్లాడిన మావోయిస్టు పార్టీ పైనా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మీద మంత్రి అప్పలరాజు సోషల్ మీడియాలో విరుచుకు పడటం, పార్టీ పంపిన లెటర్ ను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని భయపెట్టడం అతని దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు.
చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటన గుర్తు చేసిన మావోలు
అంతేకాదు మావోయిస్టు పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతున్న వారిని టార్గెట్ చేసిన మావోయిస్టులు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో దాడి విషయం, ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు పైన దాడి విషయం, మంత్రి మాధవరెడ్డిని అంతమొందించిన విషయం తెలిసే మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అంటూ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నవారు ఏ రాజకీయ పార్టీ అయినా మావోయిస్టు పార్టీ ముందు ఒకటేనని గుర్తుంచుకోవాలన్నారు.
మీ అకృత్యాలకు చరమ గీతం దగ్గరలోనే అన్న మావోల లేఖ
అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడ మావోయిస్టు పార్టీ పేద ప్రజల తరఫున నిలబడి మాట్లాడుతుందని లేఖలో స్పష్టం చేశారు. మహత్తర త్యాగాల బాటలో పయనిస్తున్న మావోయిస్టు పార్టీపై మంత్రి, అతని అనుచరులు, మావోయిస్టు పార్టీ ప్రజాసంఘాల నాయకులు గా చలామణి అవుతున్న దుష్టచతుష్టయం ఇస్తున్న సలహాలు, సూచనలతో దురహంకార పూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అధికార మదం తో విర్రవీగుతున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వీరి అకృత్యాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న విషయం మరిచిపోవద్దని లేఖలో తెలిపారు.
ప్రజా శత్రువులకు పట్టిన గతే మీకు కూడా ... హెచ్చరిక
ఇక దుష్టచతుష్టయం వీరి పద్ధతులు మార్చుకోని ఎడల ప్రజల కోపానికి గురికాక తప్పదని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ప్రజా శత్రువుల కు పట్టిన గతే వీరికి పడుతుందని మావోయిస్టులు హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో ప్రజల కోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీపై పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను, చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.