ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు శ్రీనివాస్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు యు శ్రీనివాస్(45) శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. చిన్నవయస్సులోనే మాండలిన్ వాయిద్యంలో ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి 28, 1969లో జన్మించారు. ఈయన మాండలిన్ యు శ్రీనివాస్గా పేరుపొందారు.
29ఏళ్ల వయస్సులోనే మాండలిన్ శ్రీనివాస్ 1998లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2010లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ఆరేళ్ల వయస్సు నుంచే శ్రీనివాస్ తన తండ్రి సత్యనారాయణ వద్ద మాండోలిన్ విద్యను నేర్చుకున్నారు. శ్రీనివాస్ ప్రతిభను గుర్తించిన తండ్రి సత్యనారాయణ అతనికి తగిన ప్రోత్సాహాన్ని అందించారు.
యు శ్రీనివాస్ మొదటిసారిగా 1978లో త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో మాండోలిన్ బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. ఫైన్ ఆర్ట్స్ సొసైటీ తరపున 1981లో మద్రాసులో శ్రీనివాస్ తన ప్రదర్శన ఇచ్చారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/dh9nWSHwi7c?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఆ తర్వాత అంచెలంచెలుగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. జాజ్ ఫెస్టివల్ సందర్భంగా తొలిసారిగా ఆయన బెర్లిన్లో ప్రదర్శన ఇచ్చారు. ఆయన ప్రదర్శనకు ముగ్ధులైన ప్రేక్షకులు మరోసారి ప్రదర్శించాలని ఆయనను కోరారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులైన జాన్ మెక్ లాలిన్, మైకేల్ నైమన్, మైకేల్ బ్రూక్ లాంటి వారితో శ్రీనివాస్ పలుమార్లు వేదికలను పంచుకున్నారు.