వైఎస్ జగన్ ఆ డిమాండ్పై కేంద్రం సానుకూలం?: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటన?
అమరావతి: ఏపీలో ఈ ఏడాదే కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. విభజన సమయంలో 13గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26కు చేరుకుంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల పరిపాలనకు అనువుగా.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలో మార్పులూ చేసింది. హిందుపురం, రాజంపేట వంటి పార్లమెంట్ నియోజకవర్గాలు దీనికి నిదర్శనం.

తుదిదశకు కసరత్తు..
ఇక తాజాగా- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా అసెంబ్లీ స్థానాలను రీఆర్గనైజ్ చేయాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని, ఇదివరకే దీనిపై కసరత్తు మొదలు పెట్టిందనే ప్రచారం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపించాలంటూ కేంద్ర న్యాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరినట్లు చెబుతున్నారు.

2026 తరువాతే అనుకున్నా..
నిజానికి- 2026 వరకూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండబోదంటూ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో దీనిపై ఓ ప్రకటన చేశారు. జనాభా గణన పూర్తి చేయాల్సి ఉందని, ఆ తరువాతే నియోజకవర్గాల రీ ఆర్గనైజేషన్కు వెళ్తామనీ గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

మోడీ సభలో..
ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై సత్వరమే ముందుకు వెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాల్లో దీనిపై ఓ ప్రకటన వెలువడుతుందనే ప్రచారం సాగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

పునర్విభజన వైపే
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేస్తే- ఏపీలో ఇప్పుడు ఉన్న స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది. తెలంగాణలో 119 నుంచి 153కు చేరుతుంది. ఈ విషయంలో కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడిని తీసుకొస్తోండటం వల్ల కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందని చెబుతున్నారు. తెలంగాణలో బలపడటానికి అనుకూల రాజకీయ వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications