అందుకే రాజీనామాలొద్దంటున్నా: నేతలతో కిరణ్ రెడ్డి

ఎంపీలు రాజీనామా చేయొద్దని తాను వారించడానికి బలమైన కారణం ఉందని ముఖ్యమంత్రి వారితో చెప్పారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ ప్రభావం సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరిపైనా పడుతుందని, దాంతో ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పార్లమెంటులో విభజన బిల్లును, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని విభజన జరిగిపోతుందని మంత్రులతో కిరణ్ చెప్పారట.
ఇప్పుడు రాజీనామా చేస్తే సమైక్యాంధ్రని కాపాడుకోవాలన్న ఆశయం నెరవేరే పరిస్థితి కూడా ఉండదని వారితో అన్నట్టు తెలుస్తోంది. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పడు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు తీర్మానం వీగేలా చేయాలని అప్పటి వరకు రాజీనామాల ప్రస్తావన వద్దేవద్దని అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే వాదానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా ఈ వాదానికి నష్టం చేకూర్చిన వారమవుతామని కిరణ్ వ్యాఖ్యానించారట.
తెలంగాణ బిల్లును ఎంపీలు పార్లమెంటులో వ్యతిరేకించాలని, అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఓడించాలని, అంతదాకా ఓపిక పట్టాలని సూచించారు. ఆ తర్వాత కూడా కేంద్రం ముందుకు వెళ్తే అప్పుడు అందరం కలసి సమష్టి నిర్ణయం తీసుకుందామని కిరణ్ స్పష్టం చేశారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రాజీనామాలపై సీమాంధ్ర నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
సీమాంధ్ర నేతలు విడివిడిగా రాజీనామా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా మిగతావారిపై ఒత్తిడి పెరుగుతుందని బొత్స అంటున్నారు. ఒకవేళ చేస్తే అంతా కలిసి ఒకేసారి రాజీనామా చేయాలని, ఎవరిదారిన వారు వెళ్లకుండా ఒకే మాటకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ఈ నెల 30లోగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సీఎం నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని, అందులోనే ఒక నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడాలని బొత్స చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications