మమతా బెనర్జీ ఇంట్లో విషాదం..! విగత జీవిగా పడి ఉన్న మేనకోడలు..!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఘటక్ ఇవాళ అనుమానాస్పద స్దితిలో కన్నుమూశారు. బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హట్లో ఉన్న తన నివాసంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
రాంపూర్హట్లోని తన ఇంటి రెండవ అంతస్తులో ఉన్న ఒక గదిలో 28 ఏళ్ల బ్రిస్టీ ముఖర్జీ ఘటక్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాంపూర్హట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ముఖర్జీ.. గత కొన్నేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని తెలిసింది. స్థానిక వార్తల ప్రకారం ఆమెకు, ఆమె భర్తకు మధ్య విడాకుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

బ్రిస్టీ ముఖర్జీ గతంలో మమత హయాంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమంగా ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో నియామకాల ప్రక్రియలో అవకతవకల కారణంగా ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలల్లో నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఆమె ఆ ఉద్యోగాన్ని కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖర్జీ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక వసస్తే కానీ మృతికి గల కారణాలపై మరింత స్పష్టత వచ్చేలా లేదు. తాజాగా ఆదివారం రాంపూర్హాట్లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఉరి వేసుకుని చనిపోయారు. ఇది జరిగిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది.














Click it and Unblock the Notifications