ఇమ్రాన్ ఖాన్ దంపతులకు పాకిస్తాన్ కోర్టు భారీ ఊరట..! ఇకపై ఇవన్నీ..!
అవినీతి ఆరోపణలపై మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతూ, తరచుగా అనారోగ్యం పాలవుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ హైకోర్టు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అనంతరం ఇమ్రాన్ తో పాటు ఆయన భార్యకు పలు వెసులుబాట్లు కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచకూడదని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం వీరిద్దరూ సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు అడియాలా జైలు అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా, బుష్రా బీబీకి సంబంధించి ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఖాదిమ్ హుస్సేన్ ఆదేశించారు.ఇమ్రాన్ ఖాన్ కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కూడా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేసేలా చూడాలని, 15 రోజుల్లోగా అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.














Click it and Unblock the Notifications