బార్లు, సినిమా హాళ్లకు లేని నిబంధనలు గణేష్ ఉత్సవాలకెందుకు?: జగన్ సర్కారుపై బీజేపీ నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలపై విధించిన ఆంక్షలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన ఆంక్షలపై రాజకీయ చేస్తున్నారంటై అధికార వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపడుతోంది.
Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)
వినాయక చవితి పండగను ఇంట్లోనే జరుపుకోవాలన్న జీవోను ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బార్లు, సినిమాహాళ్లు, స్కూళ్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా? అని నిలదీశారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండగ జరిపి తీరుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఏపీలో హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 150కిపైగా ఇటువంటి ఘటనలు జరిగిన అరెస్టులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కన్నాతోపాటు బీజేపీ నేతలు, వీహెచ్పీ నేతలు విజయవాడలో గవర్నర్ను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణఫై ఆయనకు వినతిపత్రం అందజేశారు.

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత రాజకీయాలు చేస్తున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని.. బీజేపీ కాదని అన్నారు. కరోనావైరస్ కేవలం వినాయక చవితికేనా? అని ప్రశ్నించారు. చర్చిలకు, మసీదులకు, స్కూళ్లకు లేదా? అని నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రా? లేక దర్గాల మంత్రా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాస్టర్లకు జీతాలు ఇస్తే.. మత గ్రంథాలు జేబులో పెట్టుకుని తిరిగితే మతతత్వం కాదు.. కానీ తాము వినాయక చవితి గురించి మాట్లాడితే మతత్వమా? అని సోము వీర్రాజు వైసీపీ సర్కారును నిలదీశారు. మతరాజకీయాలు చేస్తోంది వైసీపీనేనని మండిపడ్డారు. వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వాల్సిందేనంటూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు, పట్టణాల్లోనూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ వినాయక చవితి పండుగను, రాష్ట్రంలో సామరస్య శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న లెఫ్ట్ పార్టీల విమర్శను రాష్ట్ర బీజెపి తిప్పికొట్టింది. కోవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయలేదంటూ విపక్ష నేతలు అర్ధ రహిత ఆరోపణలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. అంతేగాక, వామపక్ష నేతలు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, కుల, మత విద్వేషాలు రెచ్చకొట్టడంలో వామపక్ష పార్టీల నాయకులు సిద్ధహస్తులని బీజేపీ నేతలు ఆరోపించారు. అందుకనే లెఫ్ట్ పార్టీలను పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని ప్రజలు వెళ్ళగొట్టారంటూ ఎద్దేవా చేశారు.
అసలు వామపక్ష పార్టీలకు సిద్ధాంతాలు లేవు .. ఎప్పుడూ ఎవరో ఒకరి పంచన చేరడం.. వాళ్ళు తిరస్కరించిన తర్వాత, ఏదో ఒక రాద్దాంతం చేస్తూ కాలం గడుపడమే అంటూ బీజేపీ నేతలు వామపక్ష నేతపై ధ్వజమెత్తారు.



Click it and Unblock the Notifications
