దళిత మహిళలను స్నానాలను చిత్రీకరిస్తూ వేధింపులు:దేవాదాయ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఆగడాలు
తూర్పుగోదావరి జిల్లా:దళిత సామాజికవర్గాలకు చెందిన మహిళలు స్నానాలు చేసే ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వారిని నగ్నంగా చిత్రీకరించడంతో పాటు ఆ ఫుటేజ్ లను అడ్డుపెట్టుకొని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రిటైర్డ్ దేవాదాయ శాఖ ఉద్యోగి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అయితే ఇతడి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఆ ఫుటేజ్ స్వాధీనం చేసుకొని సైలెంట్ అయిపోయారే తప్ప ఆ రిటైర్డ్ ఉద్యోగి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగడంతో వివిధ దళిత, ప్రజా సంఘాల నేతలు వారికి సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు. దీంతో గత కొంతకాలంగా సాగుతున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...

పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన దొంగ వినాయకరావు అనే రిటైర్డ్ దేవాదాయ శాఖ ఉద్యోగి దేవదాయ భూముల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ పక్కనే దళిత మహిళలు స్నానాలు చేసే ప్రదేశాలు ఉంటాయని, వాటిని లక్ష్యంగా చేసుకొనే అతడు అక్కడ సిసి కెమేరాలను ఏర్పాటు చేసినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
సిసి కెమేరాల గురించి తమకు అవగాహన లేక స్నానాలు చేస్తున్నప్పుడు అతడు తమలో కొందరు మహిళల నగ్న దృశ్యాలను కెమేరాల ద్వారా చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందడమే కాక, ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని తమను లోబరచుకోవడానికి ప్రయత్నిస్తూ వేధింపులకు గురిచేసినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. దీంతో తాము కనీసం స్నానం చేసేందుకు ఆస్కారం లేక రాత్రి పదకొండు గంటల తర్వాతే స్నానాలు చేసే దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.
ఇంతటి నీచానికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పి.గన్నవరం పోలీసు అధికారులు ఆ సిసి పుటేజ్ను స్వాధీనం చేసుకున్నారే తప్ప వినాయకరావు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆందోళనకు దిగిన బాధిత మహిళలను గురువారం దళిత సంఘాలు, సామాజిక వాదులు, సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరామర్శించారు. తక్షణమే దళిత మహిళలకు రక్షణ కల్పించాలని, ఇంతటి అఘాతుకానికి ఒడికట్టిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పై చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications