బాబు ఇంటి వద్ద రేవంత్ ఫ్రెండ్స్ ధర్నా, ఫ్యాన్స్తో చిరు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పొత్తు పోటు తప్పడం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి, కొండగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబుతోను చెప్పారు.
అయితే, భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానం టిడిపికి దక్కలేదు. దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి మిత్ర బృందం నేతృత్వంలో మల్కాజిగిరి సీటుని రేవంత్కు ఇవ్వాలంటూ చంద్రబాబు నివాసం మంగళవారం ధర్నా చేపట్టారు.
ఉమా మాధవ రెడ్డి అలక
తొలి జాబితాలో తన వర్గానికి టిక్కెట్ దక్కలేదని నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి అలక వహించారు. ఆమె వర్గానికి చెందిన ఎమ్మెల్యే చందర్ రావుకు తొలి జాబితాలో టిక్కెట్ ఇవ్వలేదు. మరోవైపు చందర్ రావు పార్టీ అధ్యక్షుడిని కలిశారు.
అభిమానులతో చిరు భేటీ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి సీమాంధ్ర ప్రాంత మెగా అభిమానులతో మంగళవారం సాయంత్రం భేటీ కానున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం కోసం పని చేయాలని చిరు వారిని కోరనున్నారు.