నోటుకు ఓటుతో బేజారు, దూరంగా: బెజవాడుకు చంద్రబాబు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తీవ్ర మనస్తాపానికి గురైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో విజయవాడకు మారే అవకాశాలున్నాయని అంటున్నారు. విజయవాడలో ఈ నెల ఎనిమిదో తేదీన క్యాంప్ కార్యాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వారానికి మూడు రోజులు విజయవాడలో ఉంటే బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సూచించారు. తాను కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు అప్పట్లో చెప్పారు.
క్యాంప్ కార్యాలయం పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ బాబును ఈ పనులను పర్యవేక్షించాలని కోరారు. క్యాంప్ కా ర్యాలయం పనులు పెండింగ్లో ఉండటంతో వెంటనే పూర్తిచేయించాలని సీఎంవో అధికారులు నిరంతర పర్యవేక్షణ ప్రారంభించారు. అవి పూర్తయితే వచ్చే వారం నుంచి విజయవాడలో వారానికి మూడు రోజులు ఉంటానని సీఎం స్పష్టం చేశారు. విజయవాడ నుంచే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు వెళ్లే విధంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడలో ఉండే మూడు రోజులు పలు శాఖలపై సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే రాజధాని పనులు త్వరితగతిన జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం విజయవాడలోనే ఉండటంతో ఇక్కడి నుంచి మొత్తం కార్యకలాపాలు సమీక్షించే అవకాశం ఉంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఉంటే ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న వివాదాలకు కూడా దూరంగా ఉన్నట్లు ఉంటుందని కొంతమంది తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఆయన తాత్కాలిక నివాసంగా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడమా? క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాష్ట్ర ప్రభుత అతిథిగృహంలో ఉండటమా అనే అంశాన్ని సీఎం నిర్ణయానికే వదిలివేశారు. ఈ మేరకు శుక్రవారంనాడు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.