రేవంత్ రెడ్డి ఇష్యూపై ఆగ్రహం: చంద్రబాబుపై మచ్చ పడినట్లే...
హైదరాబాద్: ఎంత లేదన్నా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మచ్చ పడినట్లే. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు స్వతంత్ర సభ్యుడికి డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి చిక్కడం చంద్రబాబు ప్రతిష్టను కూడా ఏదో మేరకు దెబ్బ తీసినట్లేనని భావిస్తున్నారు.
ఎన్టీ రామారావును గద్దె దించి ప్రభుత్వాన్ని, పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకున్న వ్యవహారంపై చంద్రబాబుపై ప్రతిపక్షాల నాయకులు, ప్రత్యర్థులు ఇప్పటికీ ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఆ ఆరోపణలు, విమర్శలు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను ఏ మాత్రం దెబ్బ తీయలేదు.
ఆయన అపర చాణక్యం, రాజకీయ వ్యూహం ఇంత కాలం ప్రశంసలు అందుకుంటూ వచ్చాయి. రాజకీయ వ్యూహరచనలో చంద్రబాబును మించినవారు లేరని అంటూ వచ్చారు. కానీ, తాజా సంఘటన ఆయన రాజకీయ వ్యూహరచనను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా ఆయన నైతిక బలాన్ని కూడా దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి గానీ తనకు గానీ ఏ విధమైన అవినీతి మచ్చ లేదంటూ ఆయన చెబుకుంటూ వచ్చారు. దాన్ని చాలా మేరకు ప్రజలు కూడా అంగీకరిస్తూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాత ఆయనపై బురదపడింది. దాన్ని కడుక్కోవడానికి తగిన అస్త్రాలు కూడా ఆయన వద్ద ఉన్నట్లు లేవు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుట్ర చేశారని అనగలరే గానీ జరిగిన డీల్ను కాదనలేని స్థితి ఉంది. దానివల్లనే చంద్రబాబు తెలంగాణ టిడిపి నాయకులపై ఆదివారంనాడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్తో డీల్ నడుపుతూ చేసిన సంభాషణల వీడియోలు టీవీ చానెళ్లలో ప్రసారమైన తర్వాత చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. సోమవారం తెల్లవారు జామున ఒకసారి, ఉదయం 8 గంటల ప్రాంతంలో మరోసారి చంద్రబాబు తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబు - ఇరికిస్తున్నారని, ట్రాప్లో వేస్తున్నారని రేవంత్ రెడ్డికి ఆ మాత్రం తెలియలేదా అని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఉదంతం దిగ మింగలేని పరిస్థితినే కల్పించింది.












Click it and Unblock the Notifications