మే 23..కౌంట్డౌన్: ఎవరి సన్నాహాలు వారివి: ఏజెంట్లతో పార్టీలు..సూక్ష్మ పరిశీలకులతో కలెక్టర్లు
Recommended Video
అమరావతి: రాష్ట్ర, దేశ దశ-దిశలను మార్చేయగల ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్డౌన్ ఆరంభమైంది. మరో 12 రోజుల్లో రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోనుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలు సహా దేశవ్యాప్తంగా 543 సీట్లల్లో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో స్పష్టం కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ముందస్తుగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. సూక్ష్మ పరిశీలకులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.
సెలవుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి: సీఈసీకి కేబినెట్ అజెండా : నిర్ణయం పైనే ఉత్కంఠ..!
అన్ని జిల్లాల్లో మొదలైన శిక్షణ శిబిరాలు..
రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ శిబిరాలు ఆరంభం అయ్యాయి. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం.. ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్గా ఎంపిక చేసిన అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాల్సి ఉంది. వీవీప్యాట్ స్లిప్పుల మొదలుకుని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని, ఒక్క ఓటు కూడా తేడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని అంటున్నారు. సూక్ష్మ పరిశీలకుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
24 వేల మంది రెడీ..
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం 24 వేల మంది సిబ్బందిని నియమించనున్నారు. వారికి అదనంగా మరో మూడు వేల మందిని అందుబాటులోకి తీసుకొస్తారు. అత్యవసర వేళల్లో ఈ మూడువేల మంది సేవలను వినియోగిస్తారు. ఓట్లను లెక్కించే సిబ్బంది ఎవరనే విషయాన్ని బయటికి చెప్పరు. లెక్కింపు రోజే వారి విధులను నిర్దేశిస్తారు. ఏ అసెంబ్లీ, ఏ లోక్సభ నియోజకవర్గంలోని కౌంటింగ్ టేబుల్ వద్ద ఏ సూక్ష్మ పరిశీలకుడు ఉంటారనే విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 23వ తేదీ ఉదయం 5 గంటలకు ఎవరు ఎక్కడ పని చేయాలో వివరాలు వెల్లడవుతాయి.
ఒక్కో జిల్లాలో 2000 మందికి పైగా..
జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం వివిధ హోదాల్లోని సిబ్బంది 2000 మంది వరకు వినియోగించుకుంటున్నారు. వారి వివరాలన్నింటినీ జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషనర్కు ఇదివరకే అందజేశారు. వారు ఓట్ల లెక్కింపు చేయడానికి గంట ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కీలకం..
వీవీ ప్యాట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక నియోజకవర్గం పరిధిలో ర్యాండమ్గా ఎంపిక చేసిన అయిదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్ల స్లిప్పులను మాత్రమే లెక్కించడానికి అనుమతిస్తారు. మాక్ పోలింగ్ సందర్భంగా వీవీ ప్యాట్లలో ఆ ఓట్లు కలిస్తే ఏజెంట్లు, అభ్యర్ధుల సమక్షంలో వీటిని లెక్కిస్తారు. పోలింగ్ సందర్భంగా ఉన్న వివరాలను ఈ సందర్భంగా సరిపోల్చుకొని రెండు పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ తరహా ఓట్లను లెక్కిస్తారు. సమస్యలేమైనా తలెత్తితే అలాంటి వాటిని చివరిగా లెక్కించి నిర్ణయం తీసుకుంటారు.
రాజకీయ పార్టీలూ అప్రమత్తం
ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద గందరగోళానికి కారణం కావచ్చనే అనుమానాలతో వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఒక రోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. కౌంటింగ్ ఏజెంట్ల కోసం తెలుగుదేశం పార్టీ.. ఈ నెల 18వ తేదీన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.