ఆ విషయమే తెలియదా.. వైసిపితో ఒప్పందమా?: లక్ష్మీస్ ఎన్టీఆర్పై మాటమార్చిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరుచూ ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరుచూ ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా, ఫేస్బుక్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇజం పుస్తకంపై, ఆ తర్వాత రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణాల గురించి పోస్టులు పెట్టారు. వర్మ ఇలా పోస్టులు పెట్టడం వెనుక సినిమా ప్రచారం వ్యూహం ఉంది.
అయితే, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి వైసిపి నేత నిర్మాత కావడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన మృతి వరకు ఉంటుందని చెప్పడం కలకలం రేపుతోంది.

మొదట బయోపిక్ అన్నారు, తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనుక
తొలుత ఎన్టీఆర్పై బయోపిక్ తీస్తానని రామ్ గోపాల్ వర్ ప్రకటించారు. ఆ తర్వాత బయోపిక్కు బదులుగా లక్ష్మీపార్వతి ఎపిసోడ్ను, ఎన్టీఆర్ చివరి రోజులను సినిమాగా తీయనున్నట్లు ప్రకటన చేసి వివాదానికి తెరలేపాడు. మొదట బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయబోతున్నట్లు ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని పలువురు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసిపి నేతలతో ఒప్పందమని ప్రచారం
రామ్ గోపాల్ వర్మ రెండు ప్రకటనల మధ్య కాలంలో... ఆయనతో వైసిపి నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలూ వ్యక్తమయ్యాయనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారనే చర్చ సాగుతోంది.

అనుమానాలు, వాటిని దృష్టి మరల్చేందుకే
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వైసిపి నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. దీంతో వర్మ, వైసిపి బంధంపై తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ అనుమానాల నుంచి దృష్టి మరల్చేందుకు వర్మ తాజాగా ఇజం, అమరావతి అసెంబ్లీ అంశాలపై ఫేస్బుక్ పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పాత పోస్టునే మళ్లీ
పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇజం పుస్తకం చదివిన తర్వాత తనకు కలిగిన అభిప్రాయాన్ని వర్మ ఓ లేఖ రూపంలో రాశాడు. ఇప్పుడు మళ్లీ దాన్ని పోస్ట్ చేశాడు. ఎప్పుడో రాసిన పుస్తకం గురించి మళ్లీ ఇప్పుడు ఎందుకు స్పందించాడని అంటున్నారు.

వైసిపి నేతలతో సంబంధాలు దృష్టి మరల్చేందుకేనా
వైసిపి నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలా ఆ పోస్ట్లను పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ డిజైన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై, రాజమౌళిపై వర్మ పెట్టిన పోస్ట్ కూడా అందులో భాగమే అంటున్నారు.

ఎన్టీఆర్ పైన సినిమా ఎందుకంటే
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయిలో నాయకుడిగా ఎదిగారని, దాని తర్వాత అందరికీ తెలిసిన కొన్ని కారణాల వల్ల చాలా కష్టాలు ఎదుర్కొన్నారని, వాటిని అధ్యయనం చేసి, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, వాటి నుంచి స్ఫూర్తి పొంది సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని వర్మ అన్నారు.

వైసిపి నేతతో పరిచయంపై.. రాజకీయాల్లో ఉన్నట్లు తెలియదు
ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాండిది అని, కాబట్టి దానిని రెండున్నర గంటల్లో తీయలేమని, అందుకే తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలోనే ఓ స్నేహితుడి ద్వారా రాకేశ్ రెడ్డి నాకు పరిచయమయ్యారని, అప్పుడు ఈ కథను ఆయనకు వినిపించానని, బాగుందని చెప్పారని, కానీ ఆయన రాజకీయాల్లో ఉన్న విషయం తనకు అప్పటి దాకా తెలియదని వర్మ చెప్పారు. కేవలం అది యాదృచ్ఛికంగా జరిగిందని, రాకేశ్ ఉన్న పార్టీకీ, సినిమాకూ ఎలాంటి సంబంధం లేదన్నారు.

వార్నింగ్ ఇస్తే తగ్గేది లేదు
ఎన్టీఆర్ చిత్రంపై తనకు వార్నింగ్ ఇస్తే తగ్గే అవకాశమే లేదని వర్మ చెప్పారు. ఎవరు ఏం చేసినా, ఒకరికి నచ్చవచ్చు. మరొకరికి నచ్చకపోవచ్చు. ఇంకొకరికి చాలా బాగా నచ్చవచ్చు. మరొకరికి ఇంకా బాధాకరం కావచ్చు. ప్రత్యేకంగా ఓ పార్టీనో, ఓ వ్యక్తినో కించ పరిచే ఉద్దేశం తనకు లేదని వర్మ అన్నారు. చాలా పెద్ద సెలబ్రిటీ అయిన ఎన్టీఆర్పై సినిమా తీసే అధికారం, హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఆయన జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపించుకోవచ్చునన్నారు.

వైస్రాయ్ ఘటనపై..
తన సినిమాలో వైస్రాయ్ ఘటన ప్రధాన అంశం అని తాను చెప్పనని వర్మ అన్నారు. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకూ ప్రతీ ఘటన ఇందులో ఉంటుందిని, ఏది అన్నింటికన్నా ముఖ్యమనేది నేను చెప్పనని తెలిపారు.

రోజా నటిస్తున్నారా?
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రోజా ఓ పాత్ర పోషిస్తున్నారనే ప్రచారంపై వర్మ స్పందించారు. పాత్రలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. అలాగని రోజా ఉండరని కచ్చితంగా చెప్పలేనన్నారు. ఖరారు చేసినప్పుడు చెబుతామన్నారు.












Click it and Unblock the Notifications