షర్మిల తెలంగాణ యాత్ర: జగన్ పార్టీలో చిచ్చు, పార్టీ ఆదేశిస్తే..?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణ ఓదార్పు యాత్ర పార్టీలో చిచ్చు రేపింది. సోమవారం ఉదయం ఇబ్రహింపట్నంలో రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా రెడ్డిపురం నుంచి పరామర్శయాత్ర ప్రారంభించారు. అయితే ఈ యాత్రపై తెలంగాణ ప్రాంత పార్టీలో ముసలం నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఇబ్రహింపట్నంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు చిత్రాలను మాత్రమే ముద్రించారంటూ వైసీపీ తెలంగాణ ప్రాంత నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పరామర్శ యాత్రతో తమకు సంబంధం లేదంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, శివకుమార్ వెనుదిరిగి హైదరాబాద్కు బయలుదేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా, రెడ్డిపురంలో షర్మిల మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన రాయపురెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాయపురెడ్డి ఇంటికి షర్మిల వెళ్లి ధైర్యం చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని షర్మిల చెప్పారు. పార్టీ అదేశిస్తే ఎటువంటి కార్యక్రమాలనైనా చేస్తానని ఆమె చెప్పారు.
రైతుల ఆత్మహత్యలపై మాట్లాడడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారని, అయితే తమ పార్టీ సభ్యులు పార్లమెంటులో ఈ విషయం మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు. తాను అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణలో నామమాత్రం ఫలితాలను మాత్రమే సాధించింది. ఖమ్మం జిల్లాలో మాత్రమే పార్టీ కాస్తా ఉనికిని చాటుకుంది.
కొత్త రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఈ సమయంలో పార్టీని పటిష్టం చేసే ఉద్దేశంతో షర్మిల పరామర్స యాత్రను ప్రారంభించారు. ఆమె పరామర్శ యాత్ర సోమవారం ప్రారంభమైంది.
గతంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి షర్మిల తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించి శ్రీకాకుళంలో ముగించారు. 2500 గ్రామాలను, 116 శాసనసభా నియోజకవర్గాలను, 14 జిల్లాలను ఆమె పాదయాత్ర ద్వారా చుట్టివచ్చారు. గతంలో వైయస్ జగన్ తెలంగాణలో చేపట్టిన ఓదార్పు యాత్ర వాయిదా పడింది. ఇప్పుడు షర్మిల దాన్ని తెలంగాణలో ప్రారంభించారు.