రిషికేశ్వరి ఆత్మహత్య: 'బాబురావును ఎందుకు అరెస్ట్ చేయడంలేదు'
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ బాబురావును ఎందుకు అరెస్టు చేయడం లేదని.. ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు శనివారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
రిషికేశ్వరి మృతి ఘటన పైన దర్యాఫ్తును వేగవంతం చేయాలని వారు కోరారు. వారు శనివారం నాడు విశ్వవిద్యాలయ ఇంఛార్జీ వీసి ఉదయ లక్ష్మిని కలిశారు. ఈ సందర్భంగా రిషికేశ్వరి రెండో డైరీని, ఈ కేసులో నిందితులైన విద్యార్థులతో బాబురావు కలిసి ఉన్న ఫోటోలను ఆమెకు అందజేశారు.
కఠిన చర్యలు: గంటా
ఏపీని ర్యాగింగ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు చెప్పారు. విజయవాడలో ఆయన శనివారం వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ర్యాగింగుకు పాల్పడితే గతంలో టీసీ ఇచ్చి పంపేవారని, ఇప్పుడైతే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తారన్నారు. విద్యాసంస్థల అధిపతులను బాధ్యులను చేస్తామన్నారు. వైస్ ఛాన్సులరే విశ్వవిద్యాలయానికి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ప్రయివేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర కేపినెట్ ఆమోదించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విశ్వవిద్యాలయాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిల్లాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటిస్తామన్నారు.