రిషికేశ్వరిపై కేసు: వీడియో మాయం, థియేటర్లో ఏం జరిగింది?
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో వాస్తవాలను వెలికితీయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం విచారణ ప్రారంభించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్యణ్యం నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ విశ్వవిద్యాలయంలో విచారణ చేపట్టింది.
రిషితేశ్వరి ఉరి వేసుకున్న దగ్గర నుంచి ప్రిన్సిపాల్ బాబూరావు సస్పెన్షన్, సాక్ష్యాల గల్లంతు, యాంటీ ర్యాగింగ్ కమిటీ పనితీరు, మంగళగిరి సినిమా థియేటర్లో ఏమి జరిగింది, ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఎలా మాయమైంది వంటి విషయాలపై విచారణాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
రిషికేశ్వరిని వేధిస్తున్నారంటూ ఆమె చనిపోవడానికి పది రోజుల ముందు ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆందోళనను విరమించిన తర్వాత హడావిడిగా విశ్వవిద్యాలయానికి పది రోజులు సెలవులు ప్రకటించడం, తదితర అంశాలపై విచారణ జరుపనున్నట్లు తెలుస్తున్నది.
తొలిరోజు విచారణలో భాగంగా విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, సిబ్బందిని కమిటీ విచారించింది. రిషికేశ్వరి మృతి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై విచారణ చేపట్టామని విచారణ కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్యణ్యం మీడియాకు తెలిపారు. మూడురోజుల పాటు వర్సిటీలోనే ఉండి విచారణ చేపడతామన్నారు. అధ్యాపకులు, వసతి గృహ ఇన్చార్జీలు, విద్యార్థిని తల్లిదండ్రులతో మాడ్లాడతామని చెప్పారు.
పోలీసులు, విద్యార్థులు, విద్యార్థి నేతల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. బహిరంగంగా విచారణకు హాజరైనాసరే.. లేదంటే ఇన్కెమెరా విచారణకు హాజరవుతామని తెలిపినా అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. గురువారం విద్యార్థులను విచారిస్తామన్నారు.
ఎవరైనా విచారణకు హాజరుకావడానికి, ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించడానికి భయపడే వారి కోసం ఈ-మెయిల్ సదుపాయాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఐదురోజుల్లో తాము ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని బాలసుబ్రహ్మణ్యం వివరించారు.