రిషికేశ్వరి కేసు: రిమాండ్ పొడిగింపు, 'ఉమెన్స్ హాస్టల్లో యువకులా?'
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు శుక్రవారం నాడు రిమాండును పొడిగించింది. ఈ నెల 28వ తేదీ వరకు వారి రిమాండ్ పొడిగించింది.
గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా అనీషా, జయచరణ్, శ్రీనివాస్ ఉన్నారు. ఏ1గా అనీషా, ఏ2గా జయచరణ్, ఏ3గా శ్రీనివాస్లు ఉన్నారు.
ఇంఛార్జి వీసి ఆగ్రహం
మహిళల హాస్టళ్లలో యువకులు పని చేయడంపై నాగార్జున విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వీసి ఉదయలక్ష్మి మండిపడ్డారు. ఇక్కడ పని చేసేందుకు మహిళలు దొరకలేదా అని ప్రశ్నించారు. వెంటనే యువకులను మార్పించాలని రిజిస్ట్రార్ రాజశేఖర్ను ఆదేశించారు.
ఉదయలక్ష్మి గురువారం నాడు ఇంఛార్జ్ విసిగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఉమెన్స్ హాస్టల్ను సందర్శించారు. భోజన శాలలో విద్యార్థునీల వద్దకు వెళ్లి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలు ఆమె ముందు ఉంచారు.
వెంటనే ఇంఛార్జీ విసి... సిబ్బందిని పిలిపించి సరిగా పని చేయకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. భోజం, పరిశుభ్రత పైన ప్రశ్నించినందుకు తనను వేధించారని ఓ విద్యార్థి ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రత్యేకంగా డ్రస్ వేసుకోవాలని ఆదేశించారు.
ఆ తర్వాత ఆమె జెంట్స్ హాస్టల్ను సందర్శించారు. ప్రస్తుతానికి జెంట్స్ హాస్టళ్లలో పని చేస్తున్న పెద్ద వయస్సు గల పురుషులను ఉమెన్స్ హాస్టల్కు మార్చాలని సూచించారు. కాగా, ఇంఛార్జ్ వీసి ఆదేశాలతో వసతి గృహాల్లో పని చేస్తున్న సిబ్బందిని బదలీ చేసేందుకు వర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.