అర్కె బీచ్: జగన్ వర్సెస్ పవన్ అవుతుందా ?, ఈ స్టార్లంతా...
ప్రత్యేక హోదాకోసం ఆర్కె బీచ్లో తలపెట్టిన ప్రదర్శన విచిత్రమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పవన్ కల్యాణ్ వర్సెస్ జగన్గా మారుతుందా అనుమానాలు తలెత్తుతున్నాయి.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు విశాఖపట్నంలోని ఆర్కె బీచ్లో తలపెట్టిన ప్రదర్శన ప్రారంభానికి ముందే మలుపు తీసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నడిపించాలని కొంత మంది యువకులు తలపెట్టినట్లు కనిపిస్తోంది.
అయితే, అనివార్యంగానే అది రాజకీయ రంగును పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ అండదండలు అందిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, వచ్చే ఎన్నికల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆయన విద్యాసంస్థల్లో ప్రసంగాలు చేసి, యువతను తనవైపు ఆకర్షించే పనిని చాలా కాలం కిందటే ప్రారంభించారు. దీంతో ఈ ఉద్యమం పవన్ కల్యాణ్, జగన్ మధ్య పోటీకి దారి తీస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ఇలా...
ప్రత్యేక హోదా కోసం గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ బిజెపిని, తెలుగుదేశం పార్టీని ఎదిరించే పని పెట్టుకున్నారు. ఆయన రాష్ట్రంలో ఆ అంశంపై బహిరంగ సభలు కూడా పెట్టి, ప్రసంగించారు. ఆర్కె బీచ్ ప్రదర్శనకు ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారు. తనపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన పార్లమెంటు సభ్యులపై కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
హోదా కోసం జగన్ ఇలా...
ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ చాలా కాలంగా పోరాటం సాగిస్తున్నారు. ఎపిలో వివిధ చోట్ల విద్యార్థులను, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఈ విషయంలో ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకున్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకోవాలని ఆయన పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా, ఆర్కె బీచ్లో జరిగే ర్యాలీకి తాను హాజరవుతానని ప్రకటించారు. దీంతో అది కాస్తా రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రంగంలోకి దిగిన నాగబాబు
ప్రత్యేక హోదాపై జరుగుతున్న పవన్ ఆందోళనకు ఆయన సోదరుడు నాగబాబు మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు కోసం పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు, ఇతర రాజకీయ పార్టీలకు, ఆంధ్రా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్కు, మెగా ఫ్యాన్స్కు, పవన్ ఫ్యాన్స్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
శివాజీ మొదటి నుంచీ పోరాటం...
ప్రత్యేక హోదా కోసం సినీ హీరో శివాజీ మొదటి నుంచీ పోరాటం సాగిస్తున్నారు. బిజెపిని ప్రధానం చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కూడా ఆయన లక్ష్యం చేసుకున్నారు. ఆయన ఆర్కె బీచ్కు వెళ్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది. ఓ పెళ్లి చేసుకుంటే.. భార్యను బిడ్డను ఎంత బాధ్యతగా చూసుకోవాలో అలాంటిది హోదా అని ఆయన తాజాగా అన్నారు. ప్యాకేజీ అంటే ఉంపుడు గత్తెను ఉంచుకుంటే ఇస్తే పడి ఉన్నట్లుగా అని వ్యాఖ్యానించారు. దానికి ఎప్పుడో ఏదో ఒకప్పుడు ఎంతో ఇస్తే పడేస్తే అలా పడి ఉంటుందన్నారు. అలాగే ప్యాకేజీ ఇచ్చి ఎంతో ఇస్తామని చెబుతారన్నారు. మనలను బీజేపీ - కాంగ్రెస్ విడగొట్టిందని వీటిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు.
ఆందోళనకు మెగా హీరోల మద్దతు
ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటానికి మెగా హీరోలు మద్దతు ప్రకటించారు. మెగా హీరో వరుణ్ తేజ్ తెలుగు రాష్ట్రాలకు మంచి కోరుతూ జరిగే ఈ ఆందోళనకు మద్దతుగా ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. హీరో తనిష్లు కూడా మద్దతు పలికారు. ఒక్కొక్కరుగా 26న జరగబోతున్న దీక్షకు మద్ధతు తెలుపుతున్నారు. ‘మనకి రావాల్సిన దానికి కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎపీ డిమాండ్ స్పెషల్ స్టేటస్' అని మరో హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. సందీప్ కిషన్, నిఖిల్ కూడా ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటానికి మద్దతు ప్రకటించారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ర్యాలీలో పాల్గొంటానని సందీప్ ట్వీట్ చేశాడు.
హీరో మంచు విష్ణు తీవ్ర వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా విషయంలో హీరో మంచు విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు పోరాటం మనకు గుర్తు చేస్తోందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, ఆ పోరాటానికి నా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అని విష్ణు అన్నారు. దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ, మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావడం లేదని అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం ఏంటి? కాబట్టి ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది అని విష్ణు వ్యాఖ్యానించారు.
సంపూర్ణేష్ బాబు విశాఖకు...
విశాఖకు తన టికెట్ కన్ఫర్మ్ అయిందని, రేపటి ఆర్కె బీచ్ ర్యాలీలో పాల్గొంటానని హీరో సంపూర్ణేష్ బాబు ప్రకటించారు. ఆయన ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటానికి మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన ప్రకటించారు. హక్కుల సాధన కోసం పోరాడటంలో తెలుగు వారంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా తన ఫేస్బుక్ కవర్ ఫోటోను మార్చాడు. ట్విట్టర్లో హోదాకు మద్దతుగా ట్వీట్లు చేశారు.
ప్రత్యేక హోదాపై గళమెత్తిన జెపి...
ప్రత్యేక హోదాపై లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా గళమెత్తారు. బిజెపి తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని అన్నారు. యువత చేస్తున్న ఈ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కేంద్రం చెబుతోందని, దీన్నే ప్రధాన అడ్డంకిగా చూపుతోందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయం అసలు సమస్యే కాదని ఆయన చెప్పారు. ప్రధాని పార్లమెంట్లో ఇచ్చిన హామీకి చట్టబద్ధత ఉంటుందని, కుదరని పక్షంలో కాంగ్రెస్తో పాటు 16 పార్టీల మద్దతు ఉన్నందు వల్ల బీజేపీ తలచుకుంటే ఇప్పుడు విభజన చట్టానికి సవరణ చేయడం కష్టమేమీ కాదని ఆయన అన్నారు.
టీ ఎంపీ కల్వకుంట్ల కవిత మద్దతు
ఎపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతామని తెలంగాణ ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై తెలుగువారమంతా కలిసి పోరాడాల్సి ఉందని అన్నారు. అంతా కలిస్తే అనుకున్నది సాధించవచ్చునని అబిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.