ఏపీ మంత్రులుగా బాధ్యతల్లోకి రోజా, ధర్మాన, దాడిశెట్టి రాజా-అమాత్యుల తొలి పలుకులివే
ఏపీలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు బాధ్యతలు చేపడుతున్నారు. ఏపీ సచివాలయంలోని తమ తమ ఛాంబర్లలో మంత్రులు అట్టహాసంగా తమ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇవాళ ముగ్గురు మంత్రులు ఆర్కే రోజా, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా ఇలా బాధ్యతలు స్వీకరించారు. వీరంతా సీఎం జగన్ తమకు అప్పగించిన విధి నిర్వహణలో సమర్ధంగా పనిచేస్తామని వెల్లడించారు. దీంతో పాటు తమ శాఖలకు చెందిన వ్యవహారాలపైనా మీడియాతో మాట్లాడారు.
పర్యాటక మంత్రిగా రోజా బాధ్యతలు
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఆమె.. అట్టహాసంగా కుటుంబసభ్యులతో కలిసి మంత్రి పదవి చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రోజా.. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆమెకు మంత్రి పదవి దక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా సీఎం జగన్ ను కుటుంబ సభ్యులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
రెవెన్యూ మంత్రిగా ధర్మాన బాధ్యతలు
ఏపీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం తనకు అలవాటన్నారు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయని దీనివల్ల ఆర్ధికాభివృద్ధికి భూమి ఉపయోగపడటం లేదన్నారు. ఎక్కువ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుందన్నారు. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామమాత్రపు ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
రోడ్లు భవనాల మంత్రిగా దాడిశెట్టి రాజా
జగన్ తాజా కేబినెట్ ప్రక్షాళనలో మంత్రిగా చోటు దక్కించుకున్న తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇవాళ రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో రోడ్లు , భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ... దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ, రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.