సారా చంద్రబాబు, పందికొక్కు లోకేష్: పవన్ పార్టీపై రోజా సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియాతో మాట్లాడారు.
ప్రాణం పోయినా...
తాను ప్రాణం పోయిన తెలుగుదేశం పార్టీలో చేరనని రోజా తేల్చి చెప్పారు. జీవితాంతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని రోజా స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు కులం కోసం తనను ఓడించారని, అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రాగానే ఎమ్మెల్యేను చేశారని అన్నారు.
సారా చంద్రబాబు..
ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ చేశారని సీఎం చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయన్నారు. అంతేగాక, నారా చంద్రబాబు తన పేరును సారా చంద్రబాబు నాయుడిగా మార్చుకోవాలని అన్నరు.
సిగ్గుమాలిన సీఎం
రాష్ట్రంలోని ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేదు కానీ, మద్యం మాత్రం ఇంటింటికీ ఇస్తున్నారని రోజా మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థమవుతోందని అన్నారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేష్ వాటా ఎంత అని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా? అని నిలదీశారు. తాగుబోతులంతా కూర్చుని బార్ పాలసీ తెచ్చారని మండిపడ్డారు.
పందికొక్కు తొడగొట్టినట్లు..
జయంతి, వర్ధంతికి తేడా తెలియని లోకేషా.. జగన్కు సవాల్ విసిరేది అంటూ ధ్వజమెత్తారు. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు లోకేష్ సవాల్ ఉందని అన్నారు. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్ అంటూ రోజా హితవు పలికారు.
తలాతోక లేని జనసేనలోకా.?
తలాతోక లేని జనసేన పార్టీలోకి తాను వెళ్లనని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ప్రముఖ సినీనటుడు స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తారంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆమె పై విధంగా స్పందించారు.