చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లపై కూడా కేసులు పెట్టండి.. రోజా ఫైర్!
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం దారుణమని వైసిపి నేత, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం పోసాని కృష్ణ మురళి మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు ఇప్పుడు అరెస్టు చేశారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లపై మండిపడిన రోజా
ఇదే సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ల పైన మండిపడిన రోజా గతంలో ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వీరు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. మరి బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబుల పైన ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరా అంటూ రోజా సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడిన ఆయన తప్పులను ఎత్తి చూపిన సహించలేకపోతున్నారని కావాలని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని రోజా మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం
వైసిపి సానుభూతిపరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. వైసీపీ వాళ్లు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దాం అనుకుంటే రేపు మళ్లీ అదే రిపీట్ అవుతుందని రోజా హెచ్చరించారు. ఏపీలో మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాత కూటమినేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రోజా హెచ్చరికలు జారీ చేశారు.
ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మొన్నటి బడ్జెట్ తో ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అనే విషయం ప్రజలకు అర్థమైందని రోజా తేల్చి చెప్పారు. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు ఆ పోసానిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య కాక, మరి ఏమిటని రోజా ప్రశ్నించారు. తప్పులను ఎత్తిచూపితే సహించలేకపోతున్న చంద్రబాబు ఈ తరహా చర్యలకు దిగారని రోజా విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని రోజా సూచించారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు.












Click it and Unblock the Notifications