జగన్ సీఎం కావడం తథ్యం, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు: బాబును ఏకేసిన రోజా
హైదరాబాద్/గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళా ద్రోహి, మహిళలకు మేలు చేసేందుకు ఆయనకు చేతులు రావంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆఖరి బడ్జెట్లో కూడా మహిళలకు మొండి చెయ్యి చూపించారని దుయ్యబట్టారు.
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీకి రూ. 14,200 కోట్లు కావాలని, కానీ ఇచ్చిన మాటను చివరి బడ్జెట్లో కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు. వడ్డీ లేని రుణాలకు రూ. 2,400 కోట్లు అవసరమైతే.. రూ. 1,400 కోట్లు కేటాయించారని, అవి ఏ మూలకు సరిపోతాయని రోజా మండిపడ్డారు.
విచ్చలవిడి దోపిడీ
బెల్ట్షాపులను దశల వారిగా ఎత్తేస్తామన్నారని, అయితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జాతీయ రహదారుల వద్ద, అన్ని గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం దుకాణాలు పెట్టి దోచుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. ఆడపిల్ల పుడితే రూ. 30 వేలు వేస్తామని.. గొప్పగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాడని, పండంటి పథకం కింద గర్భిణులకు రూ.10 వేలు ఇస్తామన్నారని.. ఈ నాలుగేళ్లలో ఒక్క ఆడపిల్లకైనా డబ్బులు వేశారా? అని ఆమె చంద్రబాబును నిలదీశారు.
రెండో స్థానంలో ఏపీ అంటూ రోజా ఆందోళన
కళాశాల విద్యార్థినులకు ఐప్యాడ్లు, మహిళలకు సెల్ఫోన్లు, విద్యార్థినులకు సైకిళ్లు కొనిస్తానన్న హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదన్నారు. బాబు ఇంట్లో ఆడవాళ్లు వ్యాపారాలు చేస్తే మహిళా సాధికారత సాధించినట్లేనా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ సీఎం కావడం ఖాయం
ఇది ఇలావుంటే వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త కాసు మహేష్రెడ్డి చేపట్టిన ‘అదే బాట' పాదయాత్ర శనివారం పిన్నెల్లిలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రోజాతో పాటు గుంటూరు-2 ఎమ్మెల్యే ముస్తాఫా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం కావటం తథ్యమని అన్నారు.
టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు
అక్కడ జగనన్న, ఇక్కడ మహేష్రెడ్డి నడుస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. రైతుల జీవితాల్లో ఆనందం రావాలన్నా, పేదల బతుకుల్లో వెలుగులు చూడాలన్నా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులు అందరూ వైసీపీకి మద్దుతు ఇవ్వాలని ఎమ్మెల్యే ముస్తాఫా కోరారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయని, అవినీతిని ప్రశ్నిస్తే నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు దాచేపల్లి, గురజాలను పురపాలక సంఘాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు.