ఘోర ప్రమాదం: బస్సు కిందికి దూసుకెళ్లిన కారు, ఐదుగురు మృతి
చిత్తూరు: జిల్లా బైరెడ్డిపల్లి మండలం మెట్టకురవపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు బస్సు కింద ఇరుక్కోవడంతో నుజ్జునుజ్త్జెంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, డ్రైవరు, ఓ బాలిక అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు సుమిత్ర(25), మేనక(3), వేణుగోపాల్(22), కళమ్మ(55), రమణమ్మ(45)గా పోలీసులు గుర్తించారు.
బాధితులంతా బైరెడ్డిపల్లిలోని ఓ వివాహానికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులందరూ బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపల్లికి చెందినవారని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.