పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా: నలుగురి మృతి
అనంతపురం: జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొత్తపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆటో బస్సు ఢీ: 13 మందికి గాయాలు
గుంటూరు: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతిచెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని ఆటోనగర్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: అనారోగ్య సమస్యలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం జిల్లాలోని పెందుర్తి మండల కేంద్రంలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొండకు చెందిన గరుగు రమేష్(29), సూర్యకుమారీ(25)లకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే బతుకుదెరువు కోసం విశాఖ వచ్చి పెందుర్తిలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, బుధవారం ఉదయం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్టులు చూసుకొని బాధపడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.