ఏపీలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది కూలీలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఈరోజు (జూలై 14, 2025) తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచింది.
ఈ ఘటనలో 7 మంది కూలీలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న మరో నలుగురిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన గాయపడిన వారిని, చిన్నారులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

కాగా ప్రమాదం జరిగిన సమయంలో లారీలో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. వీరిలో 19 మంది శెట్టిపల్లె గ్రామానికి చెందిన కూలీలు కాగా.. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వాపోతున్నారు. బాధితులు చెబుతున్న సమాచారం మేరకు డ్రైవర్ ఓ కఠినమైన టర్నింగ్ తీసుకునే ప్రయత్నంలో లారీ అదుపు తప్పి బోల్తా పడిందని అంటున్నారు.
మృతుల వివరాలు..
చిట్టెమ్మ - 25 ఏళ్లు
గజ్జల దర్గయ్య - 32 ఏళ్లు
గజ్జల శీను - 33 ఏళ్లు
గజ్జల లక్ష్మీదేవి - 36 ఏళ్లు
వెంకట సుబ్బమ్మ - 37 ఏళ్లు
మణిచంద్ర - 38 ఏళ్లు
రాధ - 39 ఏళ్లు
గజ్జల రమణ - 42 ఏళ్లు
రత్నమ్మ - 45 ఏళ్లు
మృతి చెందిన వారంతా రైల్వే కోడూరు మండలం శెట్టిపల్లె ఎస్టీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీ సహాయంతో లారీని పైకి లాగి క్షతగాత్రులను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు.
ఈ ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందని.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అంటూ మంత్రి ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశాలు ఆయా శాఖల అధికారులకు జారీ చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications