త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన కారు, నలుగురు మృతి
ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని తంబాళగరువు ప్రాంతానికి చెందిన మధుకర్(58), పెద్ది సురేష్(63), తాల్లూరి సురేష్(50), కొండు పాండురంగారావు(56) స్నేహితులు.
కాగా, శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఐదుగురు స్నేహితులు కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు కారులో వెళ్లారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస్ నగర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలిస్తుండగానే వీరిలో ఒకరు మృతి చెందారు.
గాయపడిన కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలంె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.