కొత్త మంత్రుల శాఖలు ఇవేనా? ఫోకస్ అంతా ఆ సీనియర్ మంత్రి మీదే: భారీ మార్పులకు ఛాన్స్?
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ గడువు సమీపించిన వేళ.. కొత్తగా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే ఆసక్తికరమైన చర్చ రాష్ట్రంలో ఊపందుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లోకి కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులు ఎవరో ఇప్పటికే తెలిసిపోయింది. ఇక- వారికి ఎలాంటి శాఖలను కేటాయిస్తారనే అంశం చర్చల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడతారనే అంశం ప్రజల నోళ్లల్లో నానుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో దీనికి సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. కేబినెట్లో సీనియర్గా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణదాస్పైనే ప్రస్తుతం అందరి చూపులూ నిలిచాయి. వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్కు కేబినెట్లో ప్రాధాన్యత లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. ఏఏ శాఖలను అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది.
కృష్ణదాస్కు రెవెన్యూ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందబోతోన్న ఆయనకు రెవెన్యూ, దాని అనుబంధ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇదివరకు ఈ శాఖలు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధీనంలో కొనసాగాయి. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన ఆ శాఖను ధర్మాన కృష్ణదాస్ చేతికి ఇస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్లో ధర్మాన కృష్ణదాస్.. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ శాఖను కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్నచెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వేణుగోపాల కృష్ణ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక మోపిదేవి వెంకటరమణ పర్యవేక్షించిన పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖను సీదిరి అప్పలరాజుకు కేటాయిస్తారని అంటున్నారు. వ్యక్తిగత అధికారులు, భద్రతా సిబ్బంది.. వంటి బదలాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు.