చంద్రబాబు నివాసం వెనుక భారీ చోరీ: ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాత్కాలిక నివాసమైన లింగమనేని గెస్ట్హౌస్కు వెనుక ఇటీవల ఓ భారీ చోరీ జరిగింది. ఈ చోరీ జరిగిన 15 రోజులైనా ఈ సంఘటన వెలుగు చూడలేదు. అయితే ఊహించని విధంగా ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం చంద్రబాబు తన మకాంను హైదరాబాదు నుంచి విజయవాడకు మార్చుకున్నారు. ఉండవల్లికి సమీపంలో కృష్ణా కరకట్టపై నిర్మించిన లింగమనేని గెస్ట్హౌస్ను తన తాత్కాలిక నివాసంగా మార్చుకున్నారు. దీంతో చంద్రబాబు భద్రత దృష్ట్యా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.
గెస్ట్హౌస్ చుట్టూ అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాక రాత్రి వేళల్లో కూడా చీమ చిటుక్కుమన్నా కనపడేలా భారీ వెలుగునిచ్చే ఖరీదైన లైట్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇంత భద్రత ఉన్నా గెస్ట్హౌస్ వెనుక 15 రోజుల క్రితం భారీ దొంగతనం జరిగింది. సీఎం చంద్రబాబు భద్రత కోసం ఏర్పాటు చేసిన అత్యంత ఖరీదైన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ మరుసటి రోజునే విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది, ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందోనన్న భయంతో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఉండవల్లి పంచాయతీకి ఆదేశాలు జారీ చేశారు.
అయితే అంత ఖరీదైన లైట్లు కోనుగోలు చేసే స్తోమత తమ పంచాయితీ వద్ద లేదని అధికారులు చెప్పినప్పటికీ, భద్రతా అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో కొత్త లైట్లు కొనలేక అద్దె ప్రాతిపదికన లైట్లను తీసుకొచ్చి ఉండవల్లి పంచాయితీ ఏర్పాటు చేసింది.
అద్దె చెల్లింపులో ఉండవల్లి పంచాయతీ విఫలమైంది. దీంతో ఆదివారం సదరు లైట్లను అద్దెకు ఇచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి పట్టపగలే లైట్లను విప్పేందుకు ఉపక్రమించాడు. దీనిని గమనించిన పరిసర రైతులు అతడిని నిలదీశారు. ఆ లైట్లు తనవేనని, అద్దెకు తెచ్చిన పంచాయతీ డబ్బులు చెల్లించకపోవడంతో తీసుకుపోతున్నానని చెప్పాడంతో చోరీ విషయం వెలుగు చూసింది.