బిగ్ బజార్లో బాబు పెట్టుబడులు, మోడీ తల్లి గోల్డ్కు రశీదు చూపగలరా: రోజా
నోట్ల రద్దు విషయం ముందే తెలిసి చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు విక్రయించి బిగ్ బజార్లో పెట్టారని రోజా ఆరోపించారు. మోడీ తన తల్లి బంగారానికి రశీదు చూపగలరా అని ప్రశ్నించారు.
నోట్ల రద్దు విషయం ముందే తెలిసి చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు విక్రయించి బిగ్ బజార్లో పెట్టారని రోజా ఆరోపించారు. మోడీ తన తల్లి బంగారానికి రశీదు చూపగలరా అని ప్రశ్నించారు.
నరసాపురం: పెద్ద నోట్లు రద్దవుతాయనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందుగానే తెలియడంవల్ల హేరిటేజ్ ఆస్తులు విక్రయించి, నల్లధనాన్ని బిగ్బజార్లో పెట్టుబడులుగా పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
హెరిటేజ్ వాటాలను అమ్ముకోవడానికి ముందు పెద్ద నోట్లు రద్దు చేయాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాయడం, ఇప్పుడు నగదు రహిత లావాదేవీలూ డిజిటల్ ఎపి అంటూ ప్రచారం చేయడం అంతా డ్రామా అని ఆమె అన్నారు. దేశంలో వంద శాతం అక్షరాస్యత లేనప్పుడు నగదు రహిత లావాదేవీలు ఎలా జరుగుతాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సామాన్యులు రోజంతా బ్యాంకుల వద్ద నిరీక్షిస్తే రూ.2వేలు కూడా దొరకడం లేదని, చంద్రబాబు పెట్టుబడులు పెట్టిన బిగ్ బజార్లలో మాత్రం చిల్లర నోట్లు కావాల్సినన్ని దొరుకుతున్నాయని చెప్పారు. నోట్లు రద్దు విషయం ముందుగానే తెలియడం వల్ల చంద్రబాబు చక్కబెట్టుకున్నారని రోజా ఆరోపించారు.
బంగారంపై కొత్త అంక్షలు తీసుకొస్తానంటున్న ప్రధాని నరేంద్ర తన తల్లి వద్ద ఉన్న బంగారానికి రసీదులు చూపించగలరా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి కేంద్రానికి ముందస్తు ఆలోచన లేదని, దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును తీసుకోలేని పరిస్థితి ప్రజలకు వచ్చిందంటే దానికి కారణం మోడీయేనని అన్నారు.
నల్లధనం ఎక్కడుందో ప్రభుత్వానికి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల వద్దనే నల్లధనం ఉందని ఆమె ఆరోపించారు. టిటిడి పాలకవర్గ సభ్యుడి వద్దకు రూ.70 కోట్ల కొత్త నోట్లు ఎలా వచ్చాయని ఆమె అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగల చేతికి తాళాలు ఇచ్చి సామాన్యులను రోడ్డు మీదికి తెచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు..